Begin typing your search above and press return to search.

ఏపీలో ఇప్పుడే 2019 సీన్ క‌నిపిస్తోంది

By:  Tupaki Desk   |   13 Sept 2017 7:00 AM IST
ఏపీలో ఇప్పుడే 2019 సీన్ క‌నిపిస్తోంది
X
2019 ఎన్నికలకు దాదాపుగా ఇంకో 20 నెల‌ల స‌మ‌యం ఉంది. అయితే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే భావ‌న‌ల కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు లేదా క్యాడ‌ర్‌ ను బ‌లోపేతం చేయ‌డం కావ‌చ్చు కానీ అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యే మంత్రం జ‌పిస్తున్నాయి. గెలుపే ద్యేయంగా ఇటు తెలుగుదేశం పార్టీ - అటు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గ్రామాలలోకి పార్టీల నాయకులు వెళ్తుంటే ఎన్నికలు వచ్చాయా అనే సందేహంలో ప్రజలు ఉండిపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు 11వ తేదీ నుంచి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ నేత‌లు పర్యటనలు ప్రారంభించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ, వృద్దులకు - వితంతువులకు - వికలాంగులకు పించన్‌ లను పెంచిన ఘనత ఒక్క టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన - చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజల దగ్గరకు వివరించి 2019 ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం బాట‌లు వేస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ - నెలకొన్న సమస్యలపై అప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల మద్దతు కొరకు అధికార పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మై వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతోంది. నవరత్నాలు - వైఎస్‌ ఆర్‌ కుటుంబం కార్యక్రమాల పేర్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రజలకు చేసిన మేలు ఏమిటో వివరిస్తూ రాబోయే ఎన్నికలలో టీడీపీకి గుణపాఠం చెప్పాలన్నదే లక్ష్యంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల‌కు ధీటుగానే వైఎస్‌ ఆర్‌ పార్టీ నాయకులు సైతం అధికార పార్టీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఎదుర్కుంటున్నసమస్యలను వింటూ - వారికి అండగా నిలిచేది వైసీపీ ఒక్కటే అంటూ ప్రచారాలు చేస్తున్నారు. కేవలం అధికార పార్టీ నాయకుల చెప్పు చేతలలో ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షగా మారిపోతుందంటూ వైసీపీ నేత‌లు ప్రచారం చేస్తున్నారు.

మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. గతంలో అధికారం కోసం టీడీపీ చేసిన హామీలు నేటికీ ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కాకపోవడంతో ఒకింత టీడీపీ నాయకులు అసహనంగానే కనిపిస్తున్నా, బయటకు మాత్రం పార్టీని బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రజలు తిడుతున్నా ముఖంపై చిరునవ్వు ఒలకబోస్తూ ప్రజలలో ప్రచారాలు చేస్తున్నారు. అలాగే వార్డులలో చిన్నపాటి యువకులను - ఖాళీగా తిరుగుతున్న వారిని సైతం పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కార్యకర్తలుగా గుర్తింపు కల్పిస్తూ వారిని ప్రచారాలకు విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్‌ పార్టీ నేతలు మాత్రం నంద్యాల - కాకినాడ ఎన్నికలలో మాకంటే టీడిపీ పార్టీకే అధికంగా నష్టం జరిగిందని అంగీక‌రిస్తూనే కొత్త ఉత్సాహంతో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలే అస్త్రంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. స్థూలంగా 2019 ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా నాయకుల తిప్పలు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు.