Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మార‌డా.. జ‌గ‌న్‌కు అవే ముఖ్య‌మా?

By:  Tupaki Desk   |   31 Jan 2022 11:00 PM IST
జ‌గ‌న్ మార‌డా.. జ‌గ‌న్‌కు అవే ముఖ్య‌మా?
X
మిన్ను విరిగి మీద‌ప‌డుతున్నా.. కొంద‌రు లైట్ తీసుకుంటారు. తీరా చిక్కుల్లో ప‌డి.. ఫ‌లితం అనుభ‌వంలోకి వ‌చ్చాక కానీ.. వారు మారరు! అచ్చు.. ఇలానే ఉంది.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి. భార‌తంలో అర్జ‌నుడికి చెట్టుపై ఉన్న ప‌క్షిక‌న్ను మాత్ర‌మే క‌నిపించిన‌ట్టుగా ఇప్పుడు జ‌గ‌న్‌కు రాష్ట్రం మొత్తం అల్ల‌క‌ల్లోలంగా మారినా.. పార్టీ నేత‌లు.. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల్ల‌కిందులు అవుతున్నా.. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు ల‌బోదిబో మంటున్నా.. కేవ‌లం `న‌వ‌ర‌త్నాలు` మాత్ర‌మే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ఇప్పుడు రాష్ట్రం చాలా క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది.

ఒక‌వైపు అప్పులు.. మ‌రో వైపు ఆదాయం లేక పోవ‌డం.. దీంతో జీతాలు ఇచ్చేందుకే ప్ర‌భుత్వం ఆప‌శోపాలు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాత్రం.. త‌న ప‌నితాను చేసుకుని పోతున్నారు. 2019 ఎన్నిక‌లకు ముందు ఒక్క చాన్స్ అని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. రాజ‌న్న రాజ్యం ఏర్పాటు చేస్తాన‌ని చెప్పారు. అంద‌రినీ స‌మానంగా చూస్తాన‌ని చెప్పారు. క‌ళ్ల‌ముందు.. స‌ర్గ‌సీమలను క‌ళాత్మ‌కంగా చూపించారు. దీంతో జ‌గ‌న్ త‌మ‌కు ఏదో చేస్తార‌ని.. త‌మ‌ను ఉద్ధ‌రిస్తార‌ని.. త‌మ జీవితాలు మారుతాయ‌ని అంద‌రూ న‌మ్మారు. ఇక‌, పార్టీ కేడ‌ర్ కూడా జ‌గ‌న్ కోసం ఎంతో చేసింది. త‌మ‌కు ప్రాధాన్యం ఉందా.. లేదా అని కూడా చూసుకోకుండా.. పార్టీ లో టికెట్ ఇచ్చారా? లేదా? అనేది కూడా చూడ‌కుండా.. జ‌గ‌న్‌ను గెలిపించుకునేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ ఆస్తులు అమ్ముకుని ఎన్నిక‌ల్లో ఖ‌ర్చులు పెట్టుకున్నారు. ఇక‌, జిల్లా, మండల స్థాయి పార్టీ ఇంచార్జులు కూడా పార్టీ నాది.. అనుకుని ముందుకు న‌డిపించి.. జ‌గ‌న్‌ను సీఎంను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగారు. నిజానికి ఎంతో క‌ష్ట‌ప‌డిన వారికి కూడా గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. మ‌న పార్టీ అధ్య‌క్షుడు సీఎం కావాలంటూ.. కాలికి బ‌ల‌పాలు క‌ట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగారు. జెండాలు మోసాలు.. ఇలా అనేక రూపాల్లో క‌ష్టప‌డి.. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు కృషి చేశారు. ఇదిలావుంటే..జ‌గ‌న్‌పై ఆశ‌ల‌తో .. ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయ‌కులు పార్టీలో చేరారు.

త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ, జ‌గ‌న్ సీఎం అయ్యారు .. కానీ.. ఎక్క‌డివారు అక్క‌డే ఉన్నారు. క‌నీసం వారి వంక క్రీగంట చూపులు కూడా సీఎం జ‌గ‌న్ సారించ‌డం లేదు. ఇక‌, పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు కూడా అప్పాయింట్‌మెంట్‌లు ఇవ్వ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ది నిధులు కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యేలు అల్లాడిపోతున్నారు. ఇక‌, ప్ర‌జ‌ల‌పై భారాలు మోపడం, చెత్త‌ప‌న్ను.. పెట్రోల్ ధ‌ర‌ల పెంపు/ త‌గ్గించ‌క‌పోవ‌డం.. ఓటీఎస్‌.. నిరుద్యోగుల‌కు ఎలాంటి ఊర‌ట క‌ల్పించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌క‌పోవ‌డంవంటివి ప్ర‌జ‌ల‌ను, అన్ని వ‌ర్గాల‌ను వేదిస్తున్నాయి.

ఇప్పుడు మ‌రోవైపు.. ఉద్యోగులు రివ‌ర్స్ పీఆర్సీ త‌మ‌కు వ‌ద్దంటూ రోడ్డెక్కారు. ఇక‌, సోషల్ మీడియాలో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. జ‌గ‌న్ క‌నీసం వాటిపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం..త‌న‌నుతాను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నార‌ని.. భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారుతోంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు చెబుతున్నా.. ఏమాత్రం చ‌ల‌నం లేని వ్య‌వ‌హారం వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. నిజానికి ఇన్ని జ‌రుగుతున్నా.. స్పందించ‌ని జ‌గ‌న్‌.. ఒక్క‌న‌వ‌ర‌త్నాల విష‌యంలో మాత్రం స్పందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు న‌వ‌ర‌త్నాలు త‌ప్ప ఏవీ క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.