Begin typing your search above and press return to search.

మీడియా మేనేజ్ మెంట్ లో జగన్ కూడా ఆరితేరినట్టే

By:  Tupaki Desk   |   15 Sept 2020 10:00 AM IST
మీడియా మేనేజ్ మెంట్ లో జగన్ కూడా ఆరితేరినట్టే
X
మీడియా మేనేజ్ మెంట్ అనేది రాజకీయాల్లో ఉన్న వారికి... అందులోనూ ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలు పన్నేవారికి ప్రధాన అస్త్రంగా మారిందని చెప్పక తప్పదు. ఇందులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మొన్నటిదాకా పెద్దగా పట్టు లేదన్న మాట గట్టిగానే వినిపించింది. అయితే ఇప్పుడు ఆయన కూడా మీడియా మేనేజ్ మెంట్ ను బాగానే వంటబట్టించుకున్నట్లుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తన కుటుంబ ఆధ్వర్యంలో ఓ దినపత్రిక, టీవీ ఛానెల్ ఉన్నా కూడా అది అంతగా అక్కరకు రాదన్న మాటను చాలా ఆలస్యంగా తెలుసుకున్న జగన్ ఇప్పుడు మీడియా మేనేజ్ మెంట్ ను తనదైన శైలిలో నెరపుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న రెండు కీలక పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదివారం నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో... అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబును జగన్ సర్కారు ఎలా ఇరికించబోతున్న దానిపై ఫస్ట్ పేజీ కథనం ప్రముఖంగా ప్రచురితమైంది. ఆ మరునాడే... అంటే సోమవారం నాటి ద హిందూ పత్రికలో ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయని, అందులో నారా లోకేశ్ కు కీలక పాత్ర ఉందని, దీనిపై సీబీఐ చేత విచారణ చేయించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని సంచలన కథనం ప్రచురితమైంది. ఈ రెండు కథనాలు కూడా వరుస దినాల్లో ప్రచురితం కావడం, జగన్ సర్కారులోని కీలక వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ కథనాలు వచ్చాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తించేవే.

తన కుటుంబం ఆధ్వర్యంలో సాక్షి దినపత్రిక, టీవీ ఛానెల్ ఉన్నా... అందులో రాని కథనాలు కూడా టైమ్స్, హిందూ పత్రికల్లో వచ్చాయంటే... జగన్ వ్యూహం మారడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్కారు నుంచి లీకులు అందిన నేపథ్యంలోనే అటు టైమ్స్ అయినా, ఇటు హిందూ అయినా సదరు కథనాలు రాశాయన్న మాట. అంటే.. తన సోంత పత్రికలో చంద్రబాబు అండ్ కోపై ఎన్ని కథనాలు రాసినా ప్రయోజనం లేదన్న భావనకు వచ్చిన జగన్... నేషనల్ మీడియాలో తన ప్రత్యర్థులపై వ్యతిరేక కథనాలు వచ్చేలా వ్యూహం రచించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వ్యూహంతో జగన్ కూడా మీడియాను మేనేజ్ చేయడం బాగానే నేర్చుకున్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.