Begin typing your search above and press return to search.

రేషన్ లో సన్న బియ్యం.. జగన్ కు జనం నీరాజనాలు!

By:  Tupaki Desk   |   22 Jun 2019 10:29 AM IST
రేషన్ లో సన్న బియ్యం.. జగన్ కు జనం నీరాజనాలు!
X
రేషన్ బియ్యం అంటే..వాటిని తినడం ఎలా ఉంటుందో.. ఆ అన్నాన్ని తిన్న వారికే తెలుస్తుంది. ఆకలి రుచి ఎరగదు అనే మాట వాస్తవమే కానీ, రేషన్ బియ్యం తినడం మాత్రం అంత తేలిక కాదు. సన్న బియ్యానికి కాస్త అలవాటు పడిన వారు అయితే రేషన్ బియ్యంతో చేసిన అన్నాన్ని భుజించడానికి కష్టపడాల్సిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లావు బియ్యం సాగు చాలా వరకూ తగ్గిపోయింది. అన్ని చోట్లా సన్నబియ్యం రకాల సాగే సాగుతూ ఉంది. లావు బియ్యం వరి త్వరగానే సాగు కూడా పూర్తి అవుతుంది. అయినా ఎక్కువ సాగు సమయం పట్టే సన్న బియ్యం సాగుకే రైతులు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.

తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసే లావు బియ్యం చాలా నయం. స్టోర్ బియ్యంతో పోలిస్తే రైతులు సాగు చేసే లావు బియ్యాలు చాలా బాగుంటాయి. స్టోర్ బియ్యం నాణ్యతా రహితంగానే ఉంటాయి. ఒకవేళ స్టోర్లో బియ్యాన్ని తీసుకున్నా.. పల్లెటూరు జనాలు వాటిని తినడం లేదు. వాటిని అమ్మేస్తూ ఉన్నారు. అలా అమ్మిన బియ్యమే మళ్లీ ఎఫ్సీఐ గోడౌన్లకు చేరుతున్నాయట. మళ్లీ వాటినే స్టోర్ లకు పంపుతూ ఉన్నారట!

ఇలా తినడానికి కాకుండా బియ్యం రీసైకిల్ వ్యాపారానికి వెళ్తూ ఉన్నాయి. మరీ పేదలు తప్ప రేషన్ బియ్యం తీసుకుంటున్న మధ్యతరగతి కూడా వాటిని తినడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. స్టోర్ లో కూడా సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్టోర్ లలో సన్నబియ్యం అందుబాటులోకి వస్తుందని, వలంటీర్ల ద్వారా ఇంటింటికీ స్టోర్ బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

అవి సన్నబియ్యమే అని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించి బియ్యం సేకరణ చేపట్టాలని పౌరసరఫరాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తానికి స్టోర్ ల ద్వారా సన్నబియ్యం పంపిణీ అనేది సంచలన నిర్ణయమే. పేదలకు ఆనందాన్ని ఇచ్చే అంశమే.