Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అనే నేను.. క‌డుపు నిండే హామీ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   8 July 2019 4:47 PM IST
జ‌గ‌న్ అనే నేను.. క‌డుపు నిండే హామీ ఇచ్చారు!
X
నేను ఉన్నా.. నేను విన్నా.. అంటూ దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చెప్పే మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ఆయ‌న కుమారుడు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏదైనా కీల‌క‌మైన హామీ ఇచ్చే వేళ‌లో.. జ‌గ‌న్ అనే నేను.. అంటూ హామీ ఇస్తుంటారు. తాజాగా క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. తాజాగా భారీ హామీ ఇచ్చారు. క‌డ‌ప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప‌నులు నిలిచిపోయాన‌ని.. గ‌త పాల‌కులు ఈ ప్రాజెక్టుపై ఎన్నో డ్రామాలు చేసిన‌ట్లు విమ‌ర్శంచారు.

రైతు దినోత్స‌వం రోజున క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఏర్పాటు చేసిన స‌భ‌లో పాల్గొన్న ఆయ‌న‌.. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌రు 26న జ‌గ‌న్ అనే నేను వ‌చ్చి.. అదే ఫ్యాక్ట‌రీకి శంకుస్థాప‌న చేస్తాన‌ని హామీ ఇస్తున్నా.. మూడేళ్ల‌లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మీ అంద‌రికి అందిస్తాన‌ని మాటిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మీ అంద‌రి క‌ల‌ల్ని సాకారం చేస్తాన‌ని స‌గ‌ర్వంగా చెబుతున్నాన‌ని ఆయ‌న అన్నారు. కుందూ న‌దిపై రాజోలి జ‌ల‌ద‌రాశి ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామ‌న్నారు. కేసీ కెనాల్ కింద క‌డ‌ప జిల్లాలో సాగునీరు అంద‌ని ప‌రిస్థితుల్లో రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. సాగు నీటి కోసం జ‌ల‌ద‌రాశి ప్రాజెక్టును క‌డ‌తాన‌ని.. దానికి కూడా డిసెంబ‌రు 26న శంకుస్థాప‌న చేస్తాన‌న్నారు. వేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చూస్తే..

+ జిల్లాలో బ్రహ్మంసాగర్‌ కు నీళ్లందని పరిస్థితి ఉంది. వెలుగోడు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ బ్రహ్మంసాగర్‌ కు నీళ్లు అందని పరిస్థితి కళ్ల ముందే కనబడుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తాం.

+ దివంగత నేత వైఎస్‌ ఆర్‌ కలలుగన్న రోజుల్ని మళ్లీ తీసుకొస్తా. దేవుడు కరుణిస్తే గండి కోట రిజర్వాయర్‌లో ఈ సంవత్సరం 20 టీఎంసీలు నీరు నిల్వచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గండికోట నిర్వాసితులకు ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తాం. రైతులకు తోడుగా ఉంటా.

+ గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు శ్రీకారం చుట్టాం. కరవు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రాజెక్టుల విలువ బాగా తెలుసు.

+ సమాజంలోని ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మాది. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, చివరకు రాజకీయాలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ మంచి చేసే ప్రభుత్వం మనది. ఇందుకోసం మీ అందరి దీవెనలు కావాలి.

+ కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నాం. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచాం. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నాం.

+ మా ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ రైతే కన్పించాలనేది మా ఉద్దేశం. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ ఇంటి తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

+ లంచం తీసుకున్నట్టు రుజువైతే వారిని ఉద్యోగంలోంచి పీకి పారేస్తాం. ఇక నుంచి వైఎస్‌ ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతాం. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉంది.

+ గత ప్రభుత్వ హయాంలో 2014-15లో పింఛన్లకు రూ.3,378 కోట్లు ఖర్చు చేయగా.. 2015-16లో రూ.5,201 కోట్లు, 2016-17లో 5,270 కోట్లు, 2017-18లో రూ.5,436 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లో మాత్రం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.8,234 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. నెల తిరగకుండానే మా ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసింది.

+ రైతుల పంట రుణాల కోసం కేవలం ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లిస్తే వాటిపై ఏమాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేదు.

+ జూన్‌ 1 నుంచి జులై 7 వరకు కడప జిల్లాలోనే రూ.1000 కోట్ల పంట రుణాలు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నాం.

+ నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకుంటాం. అన్నదాతలకు తోడుగా వైఎస్‌ ఆర్‌ భరోసా పథకం తీసుకొచ్చాం. వచ్చే ఏడాది ఇవ్వాల్సిన ఈ పథకాన్ని 7 నెలల ముందే ఇస్తున్నాం. రాష్ట్రంలో 70శాతం మంది రైతులకు హెక్టారులోపు పొలమే ఉంది. రైతు భరోసా కింద 70లక్షల మంది రైతులకు రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నాం.

+ తుపాన్లు వచ్చినప్పడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు మేం ఇస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్ను రద్దు చేశాం. రైతు భరోసా వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాం.

+ అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశాం. అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తాం.

+ సహకార రంగం పునరుద్ధరణకు తొలి ఏడాదిలోనే చర్యలు చేపడుతున్నాం. మూతపడిన చక్కెర పరిశ్రమలను తెరిచి చెరకు రైతులకు అండగా ఉంటాం. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు అందిస్తాం. నాణ్యమైన విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం.

+ ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ల్యాక్‌ ఏర్పాటు చేస్తాం. ఎరువులు, విత్తనాలను సైతం గ్రామాల్లోకి తీసుకొచ్చి అందిస్తాం.రూ.3వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణనిధి. పంటలు, మద్దతు ధర సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తాం. మేం వేసే ప్రతి అడుగులోనూ రైతే కన్పించాలనేది మా ఉద్దేశం.