Begin typing your search above and press return to search.

మోడీకి షాకిచ్చిన జగన్.. భారతబంద్ కు మద్దతు

By:  Tupaki Desk   |   8 Dec 2020 8:00 AM IST
మోడీకి షాకిచ్చిన జగన్.. భారతబంద్ కు మద్దతు
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కీలకమైన అంశంపై ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ రోజు జరుగుతున్న భారత్ బంద్ కు తమ ప్రభుత్వం మద్దతు పలుకుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. భారత్ బంద్ కు సీఎం జగన్ మద్దతు పలికితే సంచలనం ఎందుకు అవుతుందంటారా? దీనికి కారణం లేకపోలేదు.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంటులో మద్దతు ప్రకటించిన జగన్.. తాజాగా అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం. బిల్లుల రూపంలో ఉన్నప్పుడు మద్దతు పలికి.. చట్టాల రూపంలోకి వచ్చాక వ్యతిరేకించటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. పార్లమెంటులో ఈ బిల్లుల్ని ప్రవేశ పెట్టినప్పుడు.. బీజేపీకి సుదీర్ఘకాలంగా మిత్రపక్షంగా వ్యవహరించిన అకాలీదళ్ వ్యతిరేకించింది. అలాంటివేళలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మద్దతు పలికి.. బిల్లు పాస్ కావటంలో కీలకంగా వ్యవహరించింది.

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలంటూ గడిచిన పదకొండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ శివారులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు రైతులు. ఈ క్రమంలో ఈ నిరసనలు పలు రాష్ట్రాలకు వ్యాపించాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ఇప్పటికే డజనుకు పైగా పార్టీలు మద్దతు ప్రకటించాయి.

తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం భారత్ బంద్ కు తన మద్దతును ముందే ప్రకటించగా.. చివరి నిమిషంలో మాత్రం జగన్ బంద్ కు మద్దతు ఇవ్వటం గమనార్హం. సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటన చేస్తూ.. ఏపీలో బంద్ అధికారికంగా కొనసాగుతుందన్నారు. మోడీకి అప్రకటిత మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం.. కేంద్రానికి షాకిచ్చేలా నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అన్నది ప్రశ్నగా మారింది.

రైతుల క్షేమం కోసం.. వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడటంతో పాటు.. వారి మనోభావాల్ని గౌరవిస్తున్నామన్న విషయాన్ని తెలియజేయటానికే బంద్ కు మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటల వరకు బస్సు సర్వీసులు నడకూడదని ఆర్టీకి ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలు.. పాఠశాలల్ని మూసివేయాలని.. బంద్ ను స్వచ్చందంగా.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని నిర్ణయించారు. ఏమైనా.. మిత్రత్వం కంటే రైతు ప్రయోజనాలు ముఖ్యమన్న విషయాన్నితాజా నిర్ణయంతో జగన్ సర్కారు చెప్పకనే చెప్పేసినట్లైంది.