Begin typing your search above and press return to search.

ఇక జగన్ తోనే పీకే... ఫోకస్ పెట్టేశారా... ?

By:  Tupaki Desk   |   6 March 2022 7:00 PM IST
ఇక జగన్ తోనే పీకే... ఫోకస్ పెట్టేశారా... ?
X
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో జగన్ స్నేహం చాలా ఏళ్ళుగా సాగుతోంది. నిజానికి ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తో ఎన్నికల వ్యూహాల ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆయా పార్టీల నాయకులతో మళ్లీ ఆయన జత కట్టిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. దానికి మోడీతో మొదలుపెడితే నితీష్ కుమార్, మమతా బెనర్జీ దాకా ఇదే కధను చెప్పుకోవాలి.

మరి పీకేకి వారితో అడ్జస్ట్మెంట్ కుదరలేదా లేక వారే పీకేతో అవసరాలు తీరాయనుకున్నారా అన్నది వారి మధ్యనే తెలియాలి. ఏది ఏమైనా ఒక ఎన్నికల్లో పీకే సేవలను వాడుకున్న రాజకీయ నాయకులు మరో మారు ఆయన్ని కంటిన్యూ చేయడం అంటే అది వండర్ గానే చూడాలి.

అలాంటిది పీకేని 2019 ఎన్నికల కోసం బాగా ఉపయోగించుకున్న జగన్ 2024 కి కూడా ఆయనతోనే అంటున్నారు. పీకేకి బీజేపీ అంటే పడదు, కానీ జగన్ మాత్రం బీజేపీని పల్లెత్తు మాట అనరు. పీకేకు అర్జంటుగా కేంద్రంలో యాంటీ బీజేపీ కూటమి కట్టేయాలని ఉంది, జగన్ మాత్రం విపక్ష కూటమి వైపు చూడరు. అయినా ఈ ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా అలాగే వారి సాన్నిహిత్యం సాగుతోంది.

ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత పీకే సాయాన్ని ఇన్నాళ్ళూ ఇండైరెక్ట్ గా తీసుకుంటున్న జగన్ ఈ ఏడాది నుంచి డైరెక్ట్ గానే మరోసారి వేదిక మీదకు తీసుకురావాలని భావిస్తున్నారుట. ఈ ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీని వైసీపీ నిర్వహిస్తోంది. ఆ ప్లీనరీ వేదిక మీద జగన్ తో పాటు పీకే కూడా ఆసీనులు అవుతారు అని చెబుతున్నారు. ఇక పీకే సలహాలూ సూచనలతో 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.

మూడేళ్ళుగా పార్టీని పట్టించుకోని వైసీపీ ఇపుడు ప్లీనరీతో దూకుడు పెంచాలని కూడా అనుకుంటోందిట. 2024 కి రెండేళ్ళు మాత్రమే వ్యవధి ఉండడంతో ఇప్పటి నుంచే పార్టీని గాడిలో పెట్టుకోకపోతే రిజల్ట్ తేడా కొడుతుందన్న సంకేతాలతోనే ప్లీనరీని ఈసారి భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారుట.

అదే విధంగా పార్టీలో ప్రభుత్వంలో లోటు పాట్లను మొత్తం పీకే ద్వారా తెలుసుకుని సరిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు అంటున్నారు.

మొత్తానికి 2019 ఎన్నికల్లో పీకే సాయంలో బంపర్ విక్టరీ కొట్టిన జగన్ 2024లో కూడా సేమ్ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు గానూ పీకేని వెంటబెట్టుకునే ఇక మీదట అన్నీ చేయాలని చూస్తున్నారు. సో పీకే ఏపీ పాలిటిక్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు అని తెలుస్తోంది.

ఇక మీదట ఆయన విపక్షలా బలాలతో పాటు వైసీపీ బలహీనతలూ బలాలూ కూడా ఎప్పటికపుడు నివేదికల రూపంలో తెచ్చి జగన్ అందిస్తారు అంటున్నారు. సో పీకే ప్రభావం ఈసారి ఏపీ రాజకీయాల్లో ఎంతమేరకు ఉంటుంది అన్నది చూడాల్సిందే.