Begin typing your search above and press return to search.

గాంధీ మెడ‌లో వైసీపీ కండువాలు.. ప్ర‌కాశంలో ర‌చ్చ‌ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   25 Oct 2021 10:30 AM GMT
గాంధీ మెడ‌లో వైసీపీ కండువాలు.. ప్ర‌కాశంలో ర‌చ్చ‌ర‌చ్చ‌!
X
ప్రకాశం జిల్లా కనిగిరిలో మహత్మాగాంధీ విగ్రహానికి అపచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జాతిపిత విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గాంధీ విగ్రహానికే వైసీపీ కండువాలు కప్పడం అవమానంగా పలువురు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన ద‌ళిత సామాజిక వ‌ర్గాలు.. ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన వారిని క‌ఠినంగా శిక్షించాలంటూ.. డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. పోలీస్ స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హానికి కొంద‌రు వైసీపీ జెండాల‌ను మెడ‌లో వేశారు. దీంతో ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేపింది.

గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విషయాన్ని ఎస్‌ఐ రామిరెడ్డికి తెలియజేశారు. దీంతో ఆయన వచ్చి వైసీపీ కండువాలు తొలగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలావుంటే, కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కూడా ఆదివారం వైసీపీ జెండాను తగిలించారు. దీనిపై దళిత నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కారుకులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోని మహత్ముని విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమ న్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి జైభీమ్‌ నేత సూరే రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ద‌ళిత నాయకులు మాట్లాడుతు.. కుళ్లు రాజ‌కీయాల్లోకి గాంధీని కూడా లాగుతున్నార‌ని మండిప‌డ్డారు.

కాగా, ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు.. పంచాయితీ ఆఫీస్‌ల‌కు జెండా రంగులు వేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇది కోర్టుల వ‌ర‌కు వెళ్లి వివాదం కావ‌డం.. ప్ర‌భుత్వాన్ని కోర్టులు మంద‌లించ డం.. త‌ర్వాత విధిలేక రంగులు మార్చ‌డం తెలిసిందే. ఇక‌, ఏకంగా మ‌హాత్మా గాంధీకే వైసీపీ జెండాలు వేయడం.. మ‌రింత తీవ్రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ద‌ళిత మిత్ర సంఘం నాయ‌కులు.. మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం.. గాంధీ త‌న జీవితాన్ని త్యాగం చేశార‌ని.. అలాంటి జాతీ నేత మెడ‌లో వైసీపీ జెండాలు వేయ‌డం ఏంట‌ని.. నిల‌దీశారు. ఇలాంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారిని త‌క్ష‌ణ‌మే అవెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.