Begin typing your search above and press return to search.

ఏపీలో బిజినెస్ చేయనంటే చేయను... వైసీపీ ఎంపీ సంచలనం

By:  Tupaki Desk   |   29 March 2022 2:42 PM GMT
ఏపీలో బిజినెస్ చేయనంటే చేయను... వైసీపీ ఎంపీ సంచలనం
X
ఆయన మంచి బిజినెస్ మాన్. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడు. బిల్డర్ గా విశాఖలో పేరుంది. ఆయనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయనకు ఎంపీగా ఉంటూ తన బిజినెస్ ని కూడా చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీద ఈ మధ్య వరసగా ఆరోపణలు వస్తున్నాయి.

ఆయన భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. మీడియాకు ఎక్కి మరీ ఎంపీ మీద బాణాలు వేస్తున్నారు. ఆ విధంగా ఈ మధ్య ఒక మహిళ ఎంవీవీ మీద చేయడంతో ఆయన పరువు నష్టం దావా కోటి రూపాయలకు వేశారు. అయితే ఇపుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు.

ఏకంగా ఇంటెలిజెన్స్ ఎస్పీ మ‌ధు సొంత స్థలాన్ని ఎంపీ కబ్జా చేశారని గత కొద్ది రోజులుగా మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెలిజెన్స్ ఎస్పీ మ‌ధు తన ఇంటి చుట్టూ ప్రహారీ గోడను నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. దాంతో గోడ కడదామని చూస్తే ఎంపీ అనుచరులు అడ్డుకున్నారని మధు పేర్కొన్నారు.

దాంతో అది పెద్ద వ్యవహారంగా మారింది. దీని మీద వచ్చిన న్యూస్ వైరల్ కావడంతో ఎంపీ మనస్థాపం చెందారు. ఆయన తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద లేని పోని ఆరోపణలు వస్తున్నాయని, దీని వెనక రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకునే వారు ఉన్నారని ఎంపీ అంటున్నారు.

దాంతో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక మీదట విశాఖలో తన వ్యాపారాలు ఏవీ చేయబోనని స్పష్టం చేశారు. తన వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి చెడ్డ పేరు రాకూడదనే ఈ నిర్ణయం అని ఆయన అంటున్నారు. తాను నీతిగా నిజాయతీగా తన వ్యాపారం చేసుకుంటున్నా ఇలాంటి విమర్శలు రావడం బాధాకరం అని ఆయన అంటున్నారు.

ఇక మీదట తన వ్యాపారాలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే సాగుతాయని, విశాఖలో ఇప్పటిదాకా చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాత కొత్తవి ప్రారంభించబోమని కూడా ఎంపీ ఎంవీవీ స్పష్టం చేయడం విశేషం. మొత్తానికి ఎంపీ గారు అందునా వైసీపీకి చెందిన వారు, ఆయన కూడా ఏపీలో బిజినెస్ చేయనంటే మరి ఎవరు ఏపీలో బిజినెస్ చేస్తారు అన్నదే చర్చగా ఉంది.