Begin typing your search above and press return to search.

ఇంటింటికి రేషన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   11 March 2021 12:30 PM IST
ఇంటింటికి రేషన్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
‘ఇంటింటికి రేషన్ అందించాలనే’ జగన్ కల సాకారమైంది. వలంటీర్ల ద్వారా ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఈ పథకంలో లబ్ధి చేకూరుతోంది. జగన్ సర్కార్ ఎంతో రంగరించి.. కసరత్తు చేసి అమలు చేసిన పథకం అదీ. దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్న పథకం ఇదీ..అయితే ఈ పథకంపై తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే కామెంట్ చేసినట్టు మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ‘ఇంటింటికి రేషన్ వద్దు.. పాత పద్ధతియే ముద్దు’ అని ఆయన అన్నట్టు ప్రధాన మీడియాలోనూ వార్తలు రావడం చర్చనీయాంశమైంది.

సీఎం జగన్ నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ పథకంలో కార్డుదారులకు సక్రమంగా రేషన్ అందడం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నట్టు ప్రచారం సాగుతోంది.. ఆయన ఆవేదన పూరిత వ్యాఖ్యలు అంటూ ఈ మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

పాతపద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేసినట్టు ఆ వార్తల సారాంశం.. అధికార పార్టీలో ఉంటూ ఆయన చేసిన ఈ డిమాండ్ చేశారని సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రత్యర్థులు హోరెత్తిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన స్వగృహం రాంపురంలో ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. గోడౌన్ వద్ద బియ్యం పంపిణీలో కోత విధించి డీలర్లకు ఇస్తున్నారని మండిపడ్డారట.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనులకు వెళ్లిన సమయంలో రేషన్ వాహనాలు రావడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారట.. మరికొన్ని చోట్ల సర్వర్ సమస్యలతో లబ్ధిదారులకు బియ్యం అందడం లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్టు తెలిసింది.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసినట్టు ప్రచారం సాగుతోంది.