Begin typing your search above and press return to search.

వైసీపీ నేత కబ్జా.. అడిగేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దారుణ దాడి

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:24 AM GMT
వైసీపీ నేత కబ్జా.. అడిగేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దారుణ దాడి
X
వైజాగ్ లో వైసీపీ నేత ఒకరు రెచ్చిపోయారు. ఎవరైతే నాకేం అన్నట్లు వ్యవహరించారు. తాను కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై తిరగబడటమేకాదు.. వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.అక్కడితో ఆగకుండా.. వారు తీసుకొచ్చిన ప్రొక్లెయిన్ ను తగలబెట్టేస్తానంటూ వ్యవహరించిన వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. పట్టపగలు.. రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసి.. వారిని కొట్టేసిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించి రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శివకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) పరిధిలో 88వ వార్డు పరిధిలో సత్తివానిపాలెం లో సుమారు 100 ఎకరాల్లో రేవళ్ల చెరువు ఉంది. అందులో నుంచే గ్రామస్థులు రాకపోకలు చేస్తుంటారు.దీంతో.. ప్రజలకు అనువుగా ఉండేందుకు వీలుగా ఇది పంచాయితీగా ఉన్న వేళలోనే రోడ్డు వేశారు. దీంతో.. 10 ఎకరాలకు పైనే భూమి మైదానభూమిగా మారిపోయింది.

కొద్ది రోజుల క్రితం 89వ వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ (గత ఏడాది కార్పొరేటర్ గా పోటీ చేశారు) అండ్ కో అక్కడి 60 సెంట్ల భూమిని తమ స్వాధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ వేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది.

ఈ ఆక్రమణపై పెందుర్తి తహసీల్దారు కార్యాలయానికి కంప్లైంట్ వెళ్లింది. దీంతో సదరు నేతకు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించలేదు. దీంతో.. ఎమ్మార్వో ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్ స్పెక్టర్.. వీఆర్వో.. సర్వేయర్.. పలువురు సిబ్బంది కలిసి ప్రొక్లెయిన్ తీసుకొని ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లారు.

దీంతో ఆగ్రహించిన దొడ్డి కిరణ్ అండ్ కో రెవెన్యూ అధికారులపై ఒక్కసారిగా దాడి చేశారు. ఆర్ఐ కిరణ్ కుమార్ ను కాళ్లతో తంతూ.. మిగిలిన సిబ్బందిపై దాడి చేసి బెదిరింపులకు దిగారు. దీన్ని షూట్ చేస్తున్న సెల్ ఫోన్ ను లాగేసుకున్నారు.

ఉద్యోగులు తీసుకొచ్చి ప్రొక్లెయిన్ ను తగలబెట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన ఉద్యోగులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపి కంప్లైంట్ చేశారు. ఈ ఉదంతంపై పోలీసులు స్పందించారు.

దొడ్డి కిరణ్ తో పాటు మరో 20 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ వైనం విశాఖలో సంచలనంగా మారింది. ఇంత దారుణానికి ఎలా తెగిస్తారన్న చర్చ తాజాగా నడుస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన దొడ్డి కిరణ్ పై క్రిమినల్ కేసులు పెట్టటంతో పాటు.. అతన్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించకపోతే ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.