Begin typing your search above and press return to search.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ వాళ్లు తొక్కేస్తున్నారు..బై రెడ్డి ఆవేద‌న‌!

By:  Tupaki Desk   |   6 Jan 2020 7:21 AM GMT
వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను టీడీపీ వాళ్లు తొక్కేస్తున్నారు..బై రెడ్డి ఆవేద‌న‌!
X
గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తెలుగుదేశం పార్టీ వాళ్లు తొక్కేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు క‌ర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ వాళ్లు త‌మ‌ను తొక్కేస్తున్నారు అంటుంటే.. బైరెడ్డి మాత్రం తెలుగుదేశం వాళ్లే వైసీపీ వాళ్ల‌ను తొక్కేస్తున్నార‌ని అంటున్నారు. అదెలాగో కూడా ఆయ‌న చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అన్నేళ్లూ క‌ష్ట‌ప‌డిన వారిని అలాంటి వారు ఇప్పుడు తొక్కేస్తున్నార‌ని బైరెడ్డి అంటున్నారు. కొంద‌రైతే తెలుగుదేశం పార్టీలోనే ఉండి అన్ని ప‌నులూ చేయించుకుంటున్నార‌న్న‌ట్టుగా కూడా బైరెడ్డి అంటున్నారు. విశేషం ఏమిటంటే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని వైసీపీ అభిమానులు బైరెడ్డి సిద్ధార్థ్ మాట‌ల‌ను షేర్ చేస్తూ ఉన్నారు.

ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే సంక్షేమ ప‌థకాల‌ను పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేయాల‌నేది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌. ఆ విష‌యాన్ని తాము ఆహ్వానిస్తున్నామ‌ని, పార్టీల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా చెబుతున్నారు. అయితే ప‌నుల విష‌యంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లూ ప్రాధాన్య‌త పొంద‌డాన్ని వైసీపీ శ్రేణులు త‌ట్టుకో లేక‌పోతూ ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ హ‌యాం లో వైసీపీ జెండా ప‌ట్టిన వారిని త‌రిమి త‌రిమి కొట్టిన దాఖ‌లాలు ఉన్నాయి. ఆఖ‌రి కి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యం లో కూడా అలాంటి ప‌రిస్థితే కొన‌సాగింది. ఇక బిల్లులు, ప‌నుల విష‌యంలో అయితే వైసీపీ వాళ్ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌క‌ పోగా, వైసీపీ కోసం ప‌ని చేసిన వారిని తొక్కి పెట్టి తెలుగుదేశం వారు ప్రాధాన్య‌త‌ను పొందుతున్నార‌ని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ విష‌యాన్ని వైసీపీ ఇత‌ర నియోజ‌క‌ వ‌ర్గాల శ్రేణులు కూడా షేర్ చేస్తూ ఉన్నాయి.