Begin typing your search above and press return to search.

పేదలకు శతృవులు వారే.... ఓటీఎస్ వెనక ఓట్ల వేట.?

By:  Tupaki Desk   |   21 Dec 2021 3:52 PM IST
పేదలకు శతృవులు వారే.... ఓటీఎస్ వెనక ఓట్ల వేట.?
X
పేదలు ఎపుడూ ఉంటారు, వారు లేకపోతే ఈ లోకం ఉండదు, కధలు ఉండవు, సినిమాలు ఉండవు, రాజెకీయం కూడా అసలు పండదు. ఎవరైనా పేదల కోసమే ఎంతో చేశామని చెబుతారు. వారి ఓట్లతోనే అధికారం లోకి వస్తారు, వారు కట్టే పన్నుల తోనే ప్రభుత్వాలు కూడా నడుస్తాయి. బడ్జెట్లు కూడా వారి రెవిన్యూ తోనే రూపొందుతాయి.

మొత్తానికి భారతీయ రాజకీయాలలో పేదలకు ఉన్న ప్లేస్ చాలా గొప్పది. అలాంటి పేదలకు తాను పెన్నిధి అంటున్నారు ముఖ్య మంత్రి వైఎస్ జగన్. ఆయన పుట్టిన రోజు వేళ పేదలకు అసలైన శతృవులు ఎవరో చెప్పేశారు.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తో పాటు, ఆయన అనుకూల మీడియా పేదలకు ప్రధాన శత్రువులు అని జగన్ పక్కా క్లారిటీ తో చెప్పేశారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని ప్రారంభించిన జగన్ పేదలంటే తనకు ప్రాణమని చెప్పుకున్నారు.

అందుకే వారి కోసం ఓటీఎస్ స్కీమ్ ని తెచ్చామని చెప్పారు. స్వాతంత్రం వచ్చాక పేదలకు ఇళ్ళు అయితే ఇచ్చి నివాసం ఉండేలా గత ప్రభుత్వాలు చేశాయి కానీ వారిని ఆ ఇళ్లకు పూర్తి యజమానులను చేసిన పాలకులు ఎవరూ లేరని జగన్ పేర్కొనడం విశేషం.

ఓటీఎస్ పధకం ద్వారా మార్కెట్ రేట్లకు తమ ఇంటి విలువను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇక మీదట ఏ బెడదా లేకుండా పేదలంతా లక్షల విలువ చేసే తమ ఇళ్ళకు యజమానులు అవుతారు అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు రుణ మాఫీ కింద మొత్తాలను కలుపుకుని పదహార్ వేల కోట్లను పేదలకు ఉపకారం చేసేలా భారీ రాయితీ ఇస్తున్న ప్రభుత్వం తమదని ఆయన అంటున్నారు.

ఇలా పేదలకు మేలు చేయడానికి తమ ప్రభుత్వం చూస్తూంటే చంద్రబాబు సహా టీడీపీ అనుకూల మీడియాకు కడుపు మంటగా ఉందని జగన్ ఆక్షేపించారు. ఓటీఎస్ ద్వారా గత రుణాలు వడ్డీలు ఎంత ఉన్నా పక్కన పెట్టి కేవలం, పది నుంచి ఇరవై వేల రూపాయలు మాత్రమే కట్టమని కోరుతున్నామని, ఇది కూడా తప్పే అన్నట్లుగా విపక్షాల వైఖరి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పేదల ఇళ్ళు ఎపుడూ అలాగే ఉండాలని, వారికి హక్కులు ఏవీ రాకూడదనేనా చంద్రబాబు ఉద్దేశ్యమని కూడా జగన్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే జగన్ ఓటీఎస్ పధకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 2 వరకూ పొడిగిస్తున్నట్లుగా చెప్పారు. ఏపీలో మొత్తం ఇలా సంపూర్ణమైన గృహ హక్కులు లేని పేదలు 52 లక్షలుగా ఉన్నట్లుగా అంచనా వేశారు. వీరికి ప్రభుత్వం లక్షా 58 వేల కోట్ల మేర రాయితీ ఇస్తున్నట్లుగా జగన్ చెబుతున్నారు. అదే సమయంలో గత ముప్పయి నెలల పాలనలో లక్షా పదహారు వేల కోట్లను పేదల ఖాతాలో వేసిన ప్రభుత్వం తమదని కూడా ఆయన చెప్పడం విశేషం.

ఇలా పేదల మంచి కోసమే టోటల్ గా మూడు లక్షల కోట్ల రూపాయల దాకా మేలు చేసిన ఘనత తమదని ఆయన పేర్కొనడం విశేషం. పేదల ఖాతాలో డబ్బులు వేసేవాడే జగన‌న్న కానీ తీసుకునేవాడు కానే కాదు అని ఆయన ఎమోషనల్ గా చెప్పిన మాటలు అయితే రాజకీయంగా చర్చకు కారణం అవుతున్నాయి.

మరో వైపు చూస్తే ఏపీలో ఈ విధంగా పక్కా గృహాల వారు 52 లక్షలు ఉన్నారు, వీరు అతి పెద్ద ఓటు బ్యాంక్, అదే విధంగా మరో 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు. వీరు కూడా భారీ ఎత్తున ఓటు బ్యాంక్ అవుతారు.

దీంతో జగన్ పేదల పక్షం తాను అంటూ చెబుఅతూనే వారికి వర్గ శత్రువులుగా టీడీపీని ఇతర పక్షాలను చూపిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి ఓటీఎస్ వెనక భారీ ఓట్ల వేట కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. ఇంతటి పెద్ద ఓటు బ్యాంక్ ఉండడం వల్లనే తన పుట్టిన రోజున జగన్ స్వయంగా ఓటీఎస్ గురించి వివరించి పేదలను లక్షాధికారులను చేస్తున్నామని ప్రకటించారు అన్న మాట ఉంది.

మొత్తానికి ఓటీఎస్ పధకం క్లిక్ అయితే ప్రభుత్వానికి నాలుగు వేల కోట్లు వస్తాయి. జనాలు దీనికి పూర్తిగా టర్న్ అయితే మరో మారు అధికారమూ వస్తుంది. అందుకే రెండు వైపులా పదునైన కత్తి లాంటి పధకానికి జగన్ తెర మీదకు తెచ్చారని అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు ఎలా వస్తాయో.