Begin typing your search above and press return to search.

క‌ల‌ల ప్రాజెక్టు క‌ల్లలేనా? వైసీపీ స‌ర్కారు అంత‌ర్మ‌థ‌నం!

By:  Tupaki Desk   |   18 Dec 2021 8:00 AM IST
క‌ల‌ల ప్రాజెక్టు క‌ల్లలేనా?  వైసీపీ స‌ర్కారు అంత‌ర్మ‌థ‌నం!
X
వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్రాజ‌క్టు.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం. దీనిద్వారా ఏకంగా.. సీమ‌లోని అత్యంత వెనుక బ‌డిన జిల్లాలు.. చుక్క‌నీటి కోసం.. అల్లాడుతున్న జిల్లాల్లోని ల‌క్ష ఎకరాల‌కుపైగా.. నీటిని అందించాల‌నే ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఉంది. వైసీపీ ప్ర‌భుత్వంతోపాటు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. దీని కోసం.. ఆయ‌న త‌న స్నేహితుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ.. వైరం పెంచుకున్నారు. సీమ ప‌థ‌కంతో తెలంగాణ లోని ప‌లు జిల్లాలు ఇబ్బంది ప‌డ‌తాయ‌ని.. నీటిని తోడేస్తార‌ని.. ఆది నుంచి కూడా తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డు ప‌డుతోంది.

దీనికి ప్ర‌తిగా.. సీఎం జ‌గ‌న్ కూడా.. వారితో వైరానికే కాలుదువ్వారు. దీనిపై చెన్నైలోని హ‌రిత ట్రైబ్యున ల్‌లో  తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన కేసును ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని.. విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నం ఉంద‌ని.. ఏపీ ప్ర‌భుత్వం వాదించింది. అయిన‌ప్ప‌టికీ.. తాజాగా ఇచ్చిన ట్రైబ్యున‌ల్ తీర్పు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చింది. దీంతో ఇప్పుడు త‌మ క‌ల‌ల ప్రాజెక్టు క‌ల్ల‌లేనా?  అంటూ.. వైసీపీ ప్ర‌భుత్వం త‌ల‌ప‌ట్టుకుంది.

సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ తాజాగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ఈ   పథకం నిర్మాణం చేపట్టవద్దని తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని, భారీ ఎత్తున జ‌రిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని..  స్పష్టం చేసింది. అంతేకాదు.. త‌క్ష‌ణ‌మే.. ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి, కేంద్ర జల సంఘం అధికారి సహా.. నలుగురితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్జీటీ తీర్పు చెప్పింది. గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేసిన‌ట్టు..  ఏపీ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. ఇదిలావుంటే.. ఈ ఎత్తిపోతల ప‌థ‌కంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు న‌వంబ‌రు 16న‌ సుదీర్ఘ విచారణ జరిగింది.

తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు.. ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో ఏపీ పాల్ప‌డిన ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ? అనే అంశంపై ఏపీ వాదనలు వినిపించింది. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా? అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు చేసినవి డీపీఆర్, ఇతర పనుల కోసమేనన్న ప్రభుత్వం.. చేసిన పనులు పూడ్చమంటారా ? అని ఎన్జీటీని ప్రశ్నించింది.

ప్రజోపయోగ పనులను ట్రైబ్యునల్‌ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు ఇచ్చిందని..తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే.. దీనికి భిన్నంగా.. తాజాగా శుక్ర‌వారం ఇచ్చిన తీర్పులో ఏపీ ప్ర‌భుత్వం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకుని తీరాల్సిందేన‌ని.. ట్రైబ్యున‌ల్ తీర్పు చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో కేంద్రం నుంచి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఇప్పుడు ఏపీకి ఏర్ప‌డింది. అయ‌తే..ఇప్పుడు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు అంటే.. అదో పెద్ద ప్ర‌హ‌సనంగానే మార‌నుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.