Begin typing your search above and press return to search.

యాహూ నీరసం.. గూగుల్, వాట్సప్ దూకుడు

By:  Tupaki Desk   |   2 Feb 2016 10:30 PM GMT
యాహూ నీరసం.. గూగుల్, వాట్సప్ దూకుడు
X
ఆ రెండూ ప్రముఖ ఐటీ కంపెనీలు. ఒకటి కష్టాల్లో చిక్కుకుని 16వేల మంది ఉద్యోగలను తొలగిస్తుండగా ఇంకోటి మాత్రం ఏకంగా తన వినియోగదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచుకుని దూసుకెళ్తోంది. ఫేస్ బుక్ సంస్థకు చెందిన వాట్స్ యాప్ మెసేంజర్ సర్వీస్ కూడా 100 కోట్ల వినియోగదారులకు రీచయింది.

ప్రముఖ ఐటీ కంపెనీ యాహూ సుమారు 16 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. యాహూ సంస్ధ నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయని, ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయార్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉద్యోగులను తొలగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపార యూనిట్లను మూసివేయనున్నారట. కాగా ఈ కామర్స్ ను విస్తృతం చేయడంలో యాహూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెర్చ్ ఇంజిన్ - వార్తలు తదితర విభాగాల్లో ఫేస్ బుక్ - గూగుల్ నుంచి యాహూ సంస్ధ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది.

యాహూ ఆ రకంగా కష్టాల్లో ఉండగా ఆ సంస్థ ప్రధాన ప్రత్యర్థి గూగుల్ మాత్రం దూసుకెళ్తోంది. తాజాగా జీమెయిల్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంలోనే ఈ సంఖ్యను చేరుకున్నప్పటికీ ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించారు.

మరోవైపు ఫేస్ బుక్ యాజమాన్యం చేతిలో ఉన్న వాట్సప్ కూడా విశేషంగా ఆదరణ పొందుతోంది. తాజాగా, వాట్సప్ కొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.