Begin typing your search above and press return to search.

మాకు విషం.. మీకు మందులా? ఫార్మాసిటీ వద్దే వద్దు!!

By:  Tupaki Desk   |   23 Dec 2020 8:30 AM GMT
మాకు విషం.. మీకు మందులా? ఫార్మాసిటీ వద్దే వద్దు!!
X
‘‘మా బతుకుల్లో విషం చిమ్మి.. మీ జీవితాల కోసం మందులు తయారు చేసుకుంటరా..? అన్ని కంపెనీలు వచ్చినక మేము బతుకుతమా? మా ఇండ్లు, పొలాలు వదిలి మేం యాడికి పోవాలె? మంది ఎంగిలి చిప్పలు కడ్డుక్కుంట మేం రోడ్డుపాలు కావాల్నా..?” తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీపై స్థానికుల స్పందన ఇది. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. తమ ప్రాంతంలో పరిశ్రమ వద్దేవద్దంటూ స్థానికులు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో భూసేకరణ నుంచి ప్రభుత్వం నాలుగు గ్రామాలను మినహాయించాల్సి వచ్చింది.

మొదటి నుంచే అభ్యంతరాలు..
రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తల్ మండలాల మధ్య ఫార్మాసిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీనికోసం 2015లో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫ్యాక్టరీ కోసం 19,333 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 9,500 ఎకరాల సేకరణ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. భూములు సేకరించినందుకు గానూ.. ఎకరం పట్టా భూమికి రూ.16లక్షలు, 120 గజాల హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ప్లాటు ఇస్తునట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది. కానీ.. దీనికి ప్రజలు ససేమిరా అంటున్నారు. ఫార్మాసిటీ వస్తే.. తమ జీవితాల్లో కాలుష్యం నిండిపోతుందని, తమ ఊళ్లు కాలుష్య కాసారాలుగా మారిపోతాయని భయాందోళన చెందుతున్నారు. దీన్నుంచి తమను కాపాడాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సర్కారు వెనక్కి తగ్గేవరకూ ఆందోళన చేస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వ వాదన ఇదీ..
ఈ ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేస్తున్న పోరాటం వెనుక కొన్ని రాజకీయశక్తులు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. “కొందరు రాజకీయాల కోసం వారిని రెచ్చగొడుతున్నారు. ప్రజలు వారి కుట్రలను అర్ధం చేసుకోవాలి’’ అని ప్రభుత్వం చెబుతోంది. అయితే గ్రామస్తులు మాత్రం అంగీకరించడం లేదు. ఫార్మాసిటీ కారణంగా కాలుష్యం పెరిగి భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికే కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆ ప్రాంతాల్లో మంచి గాలి లేదు, నీరు లేదు. మాకు అలాంటి బతుకు వద్దు’’ అంటున్నారు.

ఫార్మా కంపెనీల ప్రాంతాలలో ఇదీ పరిస్థితి..
ఇప్పటికే ఫార్మాకంపెనీలు ఉన్న గడ్డపోతారం వంటి గ్రామాల్లో వాస్తవంగానే పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్నామని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ 1988లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చామని, కంపెనీలు వస్తే మా ఊరు బాగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఏర్పాటుకు అంగీకరించామని, కానీ కాలుష్యం ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగాలు రాకపోగా.. భూగర్బ జలాలు కలుషితమై, పొలాల్లో పంటలు పండట్లేదని, గర్భిణుల్లో అబార్షన్లు పెరిగాయని, అందరికీ అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కన్నీరు పెడుతున్నారు. కాలుష్యం కారణంగా ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదని వాపోతున్నారు. గడ్డిపోతారం గ్రామంలో 200 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయని, అందులో ఎక్కువశాతం ఫార్మా కంపెనీలేనని గ్రామస్తులు చెబుతున్నారు.

ఎవ్వరూ పట్టించుకోవట్లేదు..
ఫార్మా కంపెనీల నుంచి విడుదలవుతున్న రసాయనాలు గ్రామ సమీపంలోని చెరువులోకి చేరుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఫలితం ఉండట్లేదంటున్నారు స్థానికులు. మండలికి తాము ఫిర్యాదులు ఇవ్వడం.. కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీలను మందలించడం.. ఆ తర్వాత పరిస్థితి యధాతథంగా కొనసాగడం జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న పర్యావరణవేత్తలు..
ఫార్మా కంపెనీల విషయంలో ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని, కారణంగానే కాలుష్యం ఇష్టారీతిన వెదజల్లుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. “గత 30 ఏళ్లలో ఎన్నో కెమికల్ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. అంతేకాకుండా.. ఇన్నాళ్లూ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని మూసిలోకి వదిలారని, ఇకపై ఎందులోకి వదులతారో కూడా ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

ఇందుకే ప్రజల్లో భయం..
ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఏర్పాటైన గ్రామాల్లోని దుస్థితిని చూస్తున్న యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. తమ ప్రాంతాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనల్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.

ఏర్పాటు యోచనలోనే ప్రభుత్వం..
ప్రభుత్వం మాత్రం.. ఈ ఫార్మా స్థానికుల జీవన ప్రమాణాలను మార్చేస్తుందని చెబుతోంది. “ఫార్మాసిటీ మొదటి ఫేజ్ పనులు డిసెంబర్ నెలాఖరుకల్లా ప్రారంభించాల్సి ఉంది. కానీ అనుకున్న విధంగా భూ సేకరణ జరగనందున వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రెండు ఫేజ్‌ల పనులు కలిపి ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది’’ అని టీఎస్ఐఐసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఫార్మాసిటీలో తమ పరిశ్రమల స్థాపనకు ఆసక్తిని వ్యక్తం చేశాయని సమాచారం.

ఏం జరుగుతుందో..?
ప్రభుత్వం చెబుతున్నట్టు మా బతుకులు మారుతాయి.. కానీ, అభివృద్ధి వైపు కాదని, అంథపాతాళానికి చేరుకుంటాయని స్థానికులు అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు నిలబెట్టుకుందో స్వయంగా చూశామని, మరోసారి అన్యాయం జరగనీయబోమని అంటున్నారు. ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్న కొన్ని గ్రామాల ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే హైకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేశారు. నాలుగు గ్రామాల్లో భూసేకరణపై కోర్టు స్టే ఇచ్చింది. ఫార్మాసిటీకి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేదిలేదని స్థానికులు తెగేసి చెబుతున్నారు. మరి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.