Begin typing your search above and press return to search.

మంత్రికే మోసం!!

By:  Tupaki Desk   |   20 Jun 2020 4:45 AM GMT
మంత్రికే మోసం!!
X
అధికారంలో ఉన్నాడు.. పరపతి ఉంది. పోలీసులు, అధికారులు చెప్పినట్టు వింటారు. ఒక రాష్ట్ర మంత్రి అంటే ఆ మాత్రం హంగూ ఆర్భాటాలు ఉండనే ఉంటాయి. ఎక్కడికెళ్లినా జనంలో భయం భక్తి ఉంటాయి. కానీ ఏపీ మంత్రికి ఓ వింత అనుభవం ఎదురైంది. ఏకంగా మంత్రికే టోకరా వేయగల మోసగాళ్లు ఉన్నారంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రిని మోసం చేసిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్ నీతిగా నిజాయితీగా చేసిన పనికి అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకొని సొమ్ము చెల్లిస్తే ఇంటికే వచ్చి సరఫరా చేసే సౌకర్యం కల్పించారు. మంత్రి అయినా కూడా తన పరపతితో తెప్పించుకోకుండా మంత్రి విశ్వరూప్ తాజాగా నాలుగు లారీల ఇసుక కోసం ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించాడు. కానీ ఆయనకు షాక్ తగిలింది.

నాలుగు లారీల ఇసుకకు బదులు ఆయనకు మట్టితో కూడిన ఇసుకను సరఫరా చేశారు. మంత్రి అని తెలియదో లేక నిర్లక్ష్యమో కానీ సాక్షాత్తూ మంత్రికే ఇలా నకిలీ ఇసుకను పోసి షాక్ ఇచ్చారు. రాజమండ్రి దగ్గర ముకల్లంక ర్యాంప్ నుంచి ఈ ఇసుకను తీసుకువచ్చారు.

దీంతో సీరియస్ అయిన మంత్రి అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే ఇసుకకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై చాలా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ మంత్రికే ఇసుక విషయంలో మోసం జరగడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం ఇసుక వ్యవస్థలోని లోపాలను ఇది బహిర్గతం చేసింది.