Begin typing your search above and press return to search.

రాహుల్ ఎంట్రీతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తెగింది

By:  Tupaki Desk   |   7 March 2021 10:30 AM GMT
రాహుల్ ఎంట్రీతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తెగింది
X
తమిళనాడులో డీఎంకే కూటమి లెక్కలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల సర్దుబాటుపై గడిచిన కొద్దిరోజులుగా ఉన్న ఎడతెగని చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ కోరుకునే సీట్లు.. డీఎంకే ఇస్తానన్న సీట్లకు మధ్య పొంతన కుదరని పరిస్థితి. గడిచిన ఎన్నికల్లో 41 సీట్లను కేటాయిస్తే.. కాంగ్రెస్ ఎనిమిది చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ దఫా కూడా తమకు 41 సీట్లు కేటాయించాలని కోరటంతో డీఎంకే నో అంటే నోఅని చెప్పింది.

దీంతో.. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ఎడతెగని రీతిలో సాగుతున్నాయి. ఎక్కువ సీట్లను కాంగ్రెస్ కు ఇవ్వటం ద్వారా.. గెలిచే సీట్లను పోగొట్టుకోవటం ఇష్టం లేని డీఎంకే.. ఒక దశలో కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పేందుకు సిద్ధమైంది. తాము అడిగిన సీట్లు కాకుండా పార్టీ మర్యాదకు తగినన్ని సీట్లు ఇవ్వకపోవటంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. టీపీసీసీ అధినేత అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి.

దీంతో రెండు పార్టీల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకునేందుకు.. సీట్ల లెక్కలు తేల్చేందుకురాహుల్ గాంధీ వద్దకు పంచాయితీని తీసుకెళ్లారు తమిళనాడు కాంగ్రెస్ నేతలు. ఆయన ఎంట్రీతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. రెండు పార్టీల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనను కొలిక్కి తీసుకొస్తూ..మధ్యే మార్గంగా పాతిక సీట్ల వద్ద లెక్కను తెగకోశారు. కనీసం ముప్ఫై సీట్లు అయినా ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు పట్టుపట్టగా.. రాహుల్ సలహాతో పాతిక సీట్లకు ఒప్పుకోవటానికి కాంగ్రెస్ నేతలు సరే అన్నారు. దీంతో.. పదిహేను స్థానాలకు మించి ఇవ్వటానికి సిద్ధపడని డీఎంకే.. రాహుల్ మాటతో మరో పది స్థానాలు ఎక్కువగా కేటాయించేందుకు ఓకే చెప్పింది. దీంతో.. తమిళనాడులో డీఎంకే కూటమి మధ్య నెలకొన్న సీట్ల పంచాయితీ కథ సుఖాంతమైంది.