Begin typing your search above and press return to search.

ఆయన ఎంట్రీతో ఎంపీ రిసెప్షన్ సీన్ మొత్తం మారిపోయింది

By:  Tupaki Desk   |   23 Oct 2019 5:14 AM GMT
ఆయన ఎంట్రీతో ఎంపీ రిసెప్షన్ సీన్ మొత్తం మారిపోయింది
X
వస్తారో.. రారో అన్న టెన్షన్. రావాలని ఎంత అనుకున్నా.. రాలేని పరిస్థితులు ఉన్నాయన్న మాటలు. మొత్తంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్ కు ముందు పార్టీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక కోసం యువ దంపతులతో పాటు.. పార్టీ నేతలెంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ రిసెప్షన్ కు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని తపించారు.

ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకున్న జగన్.. అరకు ఎంపీ రిసెప్షన్ జరుగుతున్న రిషికొండలోని వేదికకు చేరుకున్నారు. ఏమైనా అధినేత వస్తారన్న ఆశ ఉన్నప్పటికీ.. కుదరని పరిస్థితి ఏర్పడితే చెప్పలేమన్న సమాచారంతో నిరుత్సాహంగా ఉన్న వారికి జగన్ ఎంట్రీ సీన్ మొత్తం మారిపోయేలా చేసింది.

ముఖ్యమంత్రి రాకతో రిసెప్షన్ లో ఉత్సాహం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. అప్పటివరకూ జగన్ వస్తారో.. రారో అన్న టెన్షన్ లో ఉన్న యువ దంపతుల ముఖాలు వెలిగిపోయాయి. దీనికి తగ్గట్లే.. జగన్ సైతం ఉత్సాహంగా పార్టీ నేతలతో పాటు.. కార్యకర్తలతో సహా అందరిని పేరు పేరునా పిలిచి పలుకరించటంతో ప్రతిఒక్కరి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆనందంతో పులకరించిపోయారు.

యువ దంపతుల్ని ఆశీర్వదించేందుకు వేదిక మీదకు వచ్చిన జగన్ కు.. వారిద్దరూ పాదాభివందనం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. నూతన దంపతులతోనూ.. వారి కుటుంబ సభ్యులతోనూ కాసేపు మాట్లాడారు. మొత్తంగా సీఎం జగన్ రాకతో ఎంపీ మాధవి రిసెప్షన్ సీన్ మొత్తం మారిపోయిందన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.