Begin typing your search above and press return to search.

విజయశాంతిని కాంగ్రెస్ లైట్ తీసుకుంటుందా?

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:40 PM IST
విజయశాంతిని కాంగ్రెస్ లైట్ తీసుకుంటుందా?
X
లేడీ సూపర్‌‌స్టార్‌‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌‌డమ్‌ సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. విజయాలూ సాధించారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. కేసీఆర్ పైన చాలాసార్లు విమర్శలు చేశారు. తదుపరి టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో ఆమె విలీనం చేశారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్‌‌ క్యాంపెయినర్‌‌ అయ్యారు.

ఆమె రాజకీయాల్లోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ.. స్థిరంగా ఒక పార్టీలో ఉండరనేది ప్రధాన టాక్‌. 1998లో బీజేపీతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండు దశాబ్దాల పొలిటికట్‌ కెరియర్‌‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్‌‌పర్సన్‌గా ప్రస్తుతం ఉన్నారు. ఇటీవల ఆమె మళ్లీ కాషాయం గూటికి చేరుతున్నారని ప్రచారం నడుస్తోంది.

ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విజయశాంతిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్య ఆమె కూడా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్‌ ఆమెను చేరుకున్నదే పార్టీ తరఫున ప్రచారం చేసి.. పార్టీకి పేరు తెస్తారని. కానీ.. ఆమె మాత్రం పెద్దగా ప్రచారాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లోనూ ఆమె బయటకు రాలేదు. గత ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొనలేదు.

ఇప్పుడు బీజేపీలోకి వెళ్తారనే వార్తలు రావడంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. విజయశాంతిని సముదాయించేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌‌ను రంగంలోకి దింపింది. పార్టీ ఆదేశాల మేరకు కుసుమ కుమార్‌‌ నేరుగా విజయశాంతి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ.. ఆ చర్చలతో కూడా పెద్దగా లాభం లేదని కాంగ్రెస్‌ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆమె కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ మారే వార్తలను ఖండించలేదు. దీంతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సంప్రదింపుల అంశానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టారట. విజయశాంతి విషయంలో లైట్‌ తీసుకుందామని డిసైడ్‌ అయ్యారట.

విజయశాంతిది నిలకడలేని స్వభావం అని.. ఆమెతో పెద్దగా కాంగ్రెస్ కు ఉపయోగం లేదని కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందట.. మెదక్ జిల్లాలో ప్రభావం చూపే స్థాయిలో విజయశాంతి లేదని.. ఆమె ఉన్నా.. పోయినా పెద్దగా తేడా లేదని కాంగ్రెస్ అధిష్టానం మౌనంగా ఉంటుందోట.. అందుకే విజయశాంతి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నా పెద్దగా కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదని తెలుస్తోంది.