Begin typing your search above and press return to search.

రెండో రోజు తిరుమలలోనే జగన్ ఎందుకు ఉన్నట్లు?

By:  Tupaki Desk   |   24 Sept 2020 11:45 AM IST
రెండో రోజు తిరుమలలోనే జగన్ ఎందుకు ఉన్నట్లు?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించటం ఇదేమీ తొలిసారి కాదు. విపక్ష నేతగా ఆయన తిరుమలకు వెళ్లిన సందర్బం ఉంది. అలాంటప్పుడు ఎప్పుడు జరగని డిక్లరేషన్ రచ్చ తాజా పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దీనికి కారణంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నోటీ నుంచి అన్యాపదేశంగా వచ్చిన వ్యాఖ్యలే కారణంగా చెప్పక తప్పదు. తిరుమలకు వచ్చే ఏపీ సీఎం జగన్ కు.. స్వామివారి దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాట రావటంతో వివాదం రాజుకుంది.

మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా డిక్లరేషన్ వ్యవహారం బుధవారంతో ముగిసినట్లైంది. తిరుమలకు వచ్చిన సీఎం జగన్.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాల్ని సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాను బస చేసిన గెస్టు హౌస్ కు వచ్చేశారు. సాధారణంగా తిరుమలకు వచ్చిన వేళలో ఒక పూట ఉండేసి వెళ్లటం ఆయనకు అలవాటు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం రెండో రోజు కూడా తిరుమలలోనే ఉండటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. ఇందుకు తగిన కారణం ఉందని చెబుతున్నారు. తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ సత్రాల్ని నిర్మించనున్నారు. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప రానున్నారు. ఈ నేపథ్యం లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలలోనే ఉండిపోయారు. యడ్డీతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకోవటం ద్వారా.. బీజేపీ సీఎంకు తానిచ్చే ప్రాధాన్యత ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.