Begin typing your search above and press return to search.

రైతు చట్టాలను తెలుగు రైతులు ఎందుకు పట్టించుకోవడం లేదు?

By:  Tupaki Desk   |   19 Dec 2020 5:30 PM GMT
రైతు చట్టాలను తెలుగు రైతులు ఎందుకు పట్టించుకోవడం లేదు?
X
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లపై వారు వెనక్కి తగ్గడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపు ధోరణి అవలంభించడం లేదు. దీంతో ఆందోళన పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ చట్టాలపై వెంటనే స్పందించకపోవడానికి, మార్కెట్ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణం అని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి ప్రభుత్వాలే కొనుగోలు చేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దానికి భిన్నంగా మార్కెట్ మీద ఆధారపడాలని, ప్రభుత్వం కొంతమేరకే కొనుగోలు చేస్తుందని లెక్కలు చెబుతున్నారు.

రైతుల వద్దకే వెళ్లి కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే.. రైతులకు మరో ఆప్షన్ లేకుండా వారికే అమ్ముకునే పరిస్థితులు కల్పిస్తే.. ఇక దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయి. రైతులకు పావలా అందిస్తే.. మార్కెట్ కు వచ్చే సరికి పదిరూపాయలు అవుతుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం వైపు నుంచి సాయం అందదు. పంజాబ్ తోపాటు ఉత్తరాదిలోని కొంత మంది రైతులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారంటే.. చట్టాలపై వారికి అవగాహన ఏర్పడటమే కారణం అని చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో .. వ్యవసాయ మార్కెటింగ్ విధానం కొంత మార్పు ఉంటుంది. ఈ కారణంగా ఆ చట్టాలు తమపై పెద్దగా ప్రభావం చూపవన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే… దక్షిణాదిలో రైతులు పెద్దగా నిరసన తెలుపడం లేదు. ఆ చట్టాలపై విస్తృతమైన చర్చ జరగలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఖరీఫ్‌లోనే సుమారు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఆ ధాన్యం సేకరణ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2086 కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభినట్లు పౌరసరఫరాల శాఖ డ్యాష్ బోర్డ్ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 427, పశ్చిమ గోదావరి జిల్లాలో 366, కృష్ణా జిల్లాలో 343 కేంద్రాలున్నాయి. వాటిలో డిసెంబర్ 17 సాయంత్రానికి 92,683 మంది రైతుల నుంచి 7.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ. 1442 కోట్లు కాగా, అందులో ఇప్పటి వరకూ రైతులకు చెల్లించింది రూ. 800 కోట్లు. మరో రూ.640 కోట్ల వరకూ బకాయిలున్నట్టు ఆ రిపోర్ట్ చెబుతోంది.

బాగున్న ధాన్యంతో పాటూ రంగు మారిన ధాన్యం అమ్మకం కోసం రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. అటు దాళ్వా పనులు చేసుకోవాలా లేక ఇటు పంట అమ్మకం కోసం పాట్లు పడాలా తెలీడం లేదు. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల డిసెంబర్ నెలాఖరుకి ధాళ్వా నాట్లు వేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఖరీఫ్ పంట అమ్మడమే ఇంకా పూర్తికాలేదు. అందుకే, రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు వెళ్లి, వారు ఇచ్చిన రేటుకే పంట అమ్ముకోవాల్సి వస్తోంది.

ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు రైతు పొలంలోనే ధాన్యం కొని తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంటారు. తెలంగాణలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.

ధాన్యం పండించే వరకూ ఒక సమస్య. పంట చేతికొచ్చిందనే సంతోషం కన్నా దానిని అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఎలా.. అనే టెన్షనే ఎక్కువ. దాదాపుగా అంతా వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వ కొనుగోళ్లు నామమాత్రమే. తెలంగాణలో కొంత భాగం వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసేవారు. కానీ రానురాను అది తగ్గిపోతోంది. ప్రస్తుతం సాధారణ రకం క్వింటాల్ కి రూ. 1300 వరకూ అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం అయితే క్వింటాలుకి వంద వరకూ రైతుకి ప్రయోజనం ఉంటుంది. కానీ అది, లేక రైతు కష్టం దళారుల పాలవుతోంది.