Begin typing your search above and press return to search.

కశ్మీర్ ను కంట్రోల్ చేసిన మోడీ అసోం లో ఫెయిల్ అయ్యారెందుకు?

By:  Tupaki Desk   |   13 Dec 2019 6:47 AM GMT
కశ్మీర్ ను కంట్రోల్ చేసిన మోడీ అసోం లో ఫెయిల్ అయ్యారెందుకు?
X
ప్రధాని మోడీ శక్తి సామర్థ్యాల మీద ఎవరికి ఎలాంటి అనుమానాల్లేవు. ఆయన ఒకసారి ఫిక్స్ అయితే.. ఇక అంతే. ఎవరెంత మొత్తుకున్నా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి అయ్యే వరకూ నిద్రపోరు. ఒకటి తర్వాత ఒకటిగా తాము అనుకున్న వివాదాస్పద అంశాల లెక్క తేల్చేస్తున్న మోడీ సర్కారు.. తాజాగా పౌరసత్వ బిల్లును పార్లమెంటు లో ఆమోదముద్ర వేయటమేకాదు.. తాజాగా రాష్ట్రపతి సంతకం కూడా అయి పోయింది. అంటే.. ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందినట్లే.

ఇక.. ఎవరెంత చించుకున్నా చట్టాన్ని మార్చాలంటే అంత తేలికైన విషయం కాదు. అధికారం చేతిలో ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చన్న విషయాన్ని యూపీఏ హయాంలోనే చూసిన అనుభవం ఉంది. మోడీ హయాంలో అది మరింత బలపడటమే కాదు.. చేతిలో పవర్ ఉంటే ఇన్ని చేయొచ్చా? అన్న భావన కలిగేలా చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తుఅయితే తాజా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య భారతం రగిలిపోతుంటే.. అసోం రాష్ట్ర ఉద్రిక్తతలతో ఊగిపోవటమే కాదు.. హింసాత్మకంగా మారింది. ఆ రాష్ట్ర రాజధాని గువాహటిలో అయితే ఏకంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా రోడ్లను నిలిపేయటమేకాదు.. ఇళ్లను.. షాపుల్ని తగలపెట్టి.. లూటీకి పాల్పడుతున్న వైనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న ప్రాధమిక ప్రశ్నల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. విషయం అందరికి తెలిసిందే. మూడు దేశాలు (పాక్.. బంగ్లా.. అఫ్గాన్) నుంచి వచ్చే ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలన్న మార్పునకు ఈశాన్య భారతం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా మార్పు కారణంగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. సరిహద్దులకు దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కారణంతోనే వారు కొత్త చట్టాన్ని ఒప్పుకోవటానికి సుముఖంగా లేరు.

అధికారం చేతిలో ఉన్న అసోం లో ఇంత భారీ ఎత్తున అల్లర్లు.. నిరసనలు జరగకుండా ఎందుకు విఫలమైనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఆర్టికల్ 370 నిర్వీర్యం వేళ.. కశ్మీర్ వ్యాలీ లో చిన్న ఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్న మోడీ సర్కారు తాజా ఎపిసోడ్ లో ఎందుకంత ఫెయిల్ అయ్యింది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి కారణం.. తాము తీసుకొస్తున్న పౌరసత్వ బిల్లుపై ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయన్న అంచనాలు లేకపోవటం.. స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు.. అధికారులు రానున్న ముప్పును గ్రహించటంలో దొర్లిన తప్పిదంగా చెప్పాలి.

ఈ కారణంతోనే ప్రధాని మోడీ తానే స్వయంగా ప్రకటన చేస్తూ.. తాను భరోసా ఇస్తున్నానన్న ప్రకటన చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అసోంలో మొదలైన నిరసన మంటలు మిగిలిన ఈశాన్య భారతానికి వ్యాపిస్తాయా? అన్నది ఇప్పుడు అందరిని తొలిచేస్తున్న పెద్ద ప్రశ్న. అపొం అల్లర్లకు బాధ్యుల్ని చేస్తూ ఉన్నతాధికారుల మీద వేటువేసినా ప్రయోజనం లేకపోయింది. అధికారపక్షానికి చెందిన నేతల ఇళ్లను.. వ్యాపార సముదాయాలపైనా ప్రజలు టార్గెట్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు బీజేపీ అధినాయకత్వానికి ఆందోళన కలిగించేలా మారాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అల్లర్లను సర్దిచెప్పకపోతే.. పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మోడీ సర్కారుకు ఇది అసలుసిసలు పరీక్షా సమయంగా చెప్పక తప్పదు.