Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ వో కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   13 Dec 2021 6:30 AM GMT
ఒమిక్రాన్ పై డబ్ల్యూహెచ్ వో కీలక వ్యాఖ్యలు
X
కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ పంజా విసురుతోంది. ఈ ఏడాది మొదట్లో డెల్టాగా ఉత్పన్నమై ఎంతో మందిని బలిగింది. రెండో వేవ్ రావడానికి డెల్టా వైరస్ కారణమైందని వైద్య నిపుణులు చెప్పారు. అయితే దానివల్ల ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆంక్షల వలయంలోకి పోయాయి. ఆ తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.

ఇక అంతా బాగుందనుకునేలోపే ఒమిక్రాన్ పుట్టుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఈ వేరియంట్ వివిధ దేశాలను వణికిస్తోంది. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ పై డబ్లూహెచ్ వో ఆదివారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది డెల్టా వేరియంట్ కన్నా అతిప్రమాదకరంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా అతివేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది.

శరీరంలోని వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెలిపింది. ఇకపోతే ఈ వేరియంట్ వల్ల వచ్చే లక్షణాలు కాస్త స్వల్పంగా ఉంటాయని వివరించింది. అయితే అన్ని దేశాలు కూడా దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒమిక్రాన్ పట్ల అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. డెల్టా వేరియంట్ ప్రభావంతో ముందునుంచే దీనిని నియంత్రించడానికి ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి పెరిగితే... మూడో వేవ్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. కాగా దేశీయ, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

సెకండ్ వేవ్ తర్వాత... నిబంధనల అమలు కాస్త సన్నగిల్లింది. ఒమిక్రాన్ వ్యాప్తితో ఆంక్షలను మళ్లీ కఠినతరం చేశారు. పలు దేశాలు లాక్ డౌన్, సెమీ లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినా మనదేశంలోకి వైరస్ ప్రవేశించింది. వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కాగా దేశంలో ఇప్పటికి 36 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిలోనూ ఒమిక్రాన్ ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. అయితే ఈ వేరియంట్ సోకినా... ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు.