Begin typing your search above and press return to search.

కరోనా రోగులకు పిడుగులాంటి వార్త.. రెమ్‌డెసివిర్ పనిచేయట్లేదు

By:  Tupaki Desk   |   17 Oct 2020 5:45 AM GMT
కరోనా రోగులకు పిడుగులాంటి వార్త..  రెమ్‌డెసివిర్ పనిచేయట్లేదు
X
డబ్ల్యూహెచ్​వో కరోనా పేషేంట్లకు మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ఇప్పటి వరకు కరోనా పేషెంట్లకు రెమ్‌డెసివిర్ మందును ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు రోగులపై సమర్థవంతంగా పనిచేస్తోందని వైద్యులు చెప్తూ వచ్చారు. అంతేకాక రెమ్‌డెసివిర్ మందు కరోనా మృతులను గణనీయంగా తగ్గిస్తుందని అంతర్జాతీయంగా వైద్యులు చెప్పారు. అయితే తాజాగా రెమ్‌డెసివిర్ కరోనా రోగులపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని డబ్ల్యూహెచ్​వో స్పష్టం చేసింది. భారత్, అమెరికా, సింగపూర్, జపాన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రెమ్‌డెసివిర్ అధికారికంగానే వాడుతున్నారు. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో వ్యాధి ముదరకుండా ఉండటానికి మాత్రమే రెమ్‌డెసివిర్ తోడ్పడుతుంది తప్ప మరణాలను ఏమాత్రం తగ్గించలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది.

రెమ్‌డెసివిర్.. ఓ రేంజ్​లో బ్లాక్​ మార్కెట్​

రెమ్‌డెసివిర్ కరోనాపై పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సహా, ప్రముఖ వైద్య నిపుణులు ప్రకటించారు. దీంతో ఫార్మా కంపెనీలు బ్లాక్​ దందాకు తెరలేపాయి. ఈ మందును స్టాక్​ లేదన్న సాకుతో బ్లాక్​ మార్కెట్​లో రూ.30 వేల వరకు అమ్ముకున్నారు. అయితే ఫార్మా కంపెనీలు లాభాల కోసమే ఇలా బయట అమ్మించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కరోనా కాటుకు గురైన డొనాల్డ్ ట్రంప్ కు చికిత్సలో రెమ్‌డెసివిర్ ను అందించడం తెలిసిందే. మరోవైపు శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4కోట్లకు చేరువకాగా, మరణాల సంఖ్య 11లక్షలు దాటింది..

పక్కా స్టడీతోనే..
రెమ్‌డెసివిర్ ఎలా పనిచేస్తున్నదన్న విషయంపై డబ్ల్యూహెచ్​వో అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లోని 11,266 మంది కొవిడ్ పేషెంట్లకు రెమ్‌డెసివిర్ డోసులతో కూడిన 28 రోజుల చికిత్సను డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం చేసింది. రెమ్‌డెసివిర్ ను హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ ఎఫెక్ట్ లేకుండా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు గుర్తించారు. అయితే, కొవిడ్ మరణాలను నియంత్రించడంలో రెమ్‌డెసివిర్ ప్రభావం లేదన్న డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను గిలిద్ ఫార్మా కంపెనీ ఖండించింది. డబ్ల్యూహెచ్​వో అధ్యయనం అసమగ్రంగా ఉందని ఆ కంపెనీ ఆరోపిస్తోంది.