Begin typing your search above and press return to search.

టీడీపీలో జోష్...వైసీపీ పరేషాన్ ...23న ఏం జరగనుంది...?

By:  Tupaki Desk   |   17 March 2023 5:00 PM GMT
టీడీపీలో జోష్...వైసీపీ పరేషాన్ ...23న ఏం జరగనుంది...?
X
ఏపీలో మరో సారి 23 నంబర్ కి ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడబోతోంది. 2019లో మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీకి 151 సీట్లు దక్కాయి. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే లభించాయి. దాన్ని చూసిన జగన్ తనదైన శైలిలో నిండు అసెంబ్లీలో విశ్లేషించారు. మీకు దేవుడు ఇచ్చిన తీర్పు ఇది అంటూ చంద్రబాబు ఎదురుగానే నిండు సభలో చెప్పాల్సింది చెప్పేశారు.

ఇపుడు మరో 23 వస్తోంది. అదే మార్చి 23. ఆ రోజున ఏమి జరగనుంది అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏపీ శాసనమండలిలో ఈ కోటా కింద ఏడు సీట్లు ఖాళీ అవబోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి నిర్వహించే ఈ ఎన్నికలో అధికార పక్షమైన వైసీపీ మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించేసింది. తమవే ఆ సీట్లు అనుకుంది. పోటీ ఉండదని ఏకగ్రీవం అని కూడా భావించింది.

అయితే టీడీపీ చివరి నిముషంలో ఇచ్చిన బిగ్ ట్విస్ట్ మూలంగా ఇపుడు ఎన్నిక జరుగుతోంది. పంచుమర్తి అనూరాధ అనే బీసీ మహిళతో టీడీపీ నామినేషన్ దాఖలు చేయించింది. నిజానికి లెక్క ప్రకారం చూస్తే ఈ సీటు టీడీపీకి దక్కాల్సిందే. ఆ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు రావడంతో ఆ సంఖ్య 19కి పడిపోయింది.

అలా టీడీపీకి పోటీ చేసే సంఖ్యాబలం లేదు అని భావించడంతోనే చొరవ చేసి మరీ వైసీపీ ఏడుగురినీ బీ ఫారాలు ఇచ్చి మరీ నిలబెట్టేసింది. ఇపుడు చూస్తే చంద్రబాబు రాజకీయ చాణక్యంతో ఎన్నికలకు తెర లేచింది. అసెంబ్లీలో చూస్తే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఒక జనసేన ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాయి. ఇలా 156 మంది వైసీపీ వైపు ఉన్నట్లుగా లెక్క అయితే తేలుతోంది.

కానీ ఇందులో నుంచి రెబెల్ ఎమ్మెల్యేలు అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామనారాయణరెడ్డిని లెక్క నుంచి పక్కన పెట్టాలని అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల కొరత ఏర్పడుతుంది. అదే విధంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తోంది. అంటే ఏ నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి తెచ్చారో ఆ నలుగురు సరిగ్గా వెళ్ళి టీడీపీకి చివరి నిముషంలో మద్దతు ఇస్తే చాలు వైసీపీ నిలబెట్టిన ఏడవ ఎమ్మెల్సీ అభ్యర్ధి పరాజయం బాట పడతారు.

ఇక పట్టిందల్లా బంగారం అని నాలుగేళ్ళుగా బిందాస్ గా ఉన్న వైసీపీకి తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు కళ్ళు తెరిపించాయని అంటున్నారు. దాంతో అతి ధీమాకు పోతే పరువు పోతుందన్న కలవరంతో ఇపుడు వైసీపీ అలెర్ట్ అయింది అని అంటున్నారు. తమ వైపున ఉన్న ఎమ్మెల్యేలు అందరితోనూ ఈ నెల 23కి ముందే మాక్ ఓటింగ్ నిర్వహించి మరీ తమ బలం ఎంతో పూర్తిగా బేరీజు వేసుకోవడమే కాకుండా ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ అసలు ఓటింగ్ కి వెళ్ళాలని చూస్తున్నారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పరాభవం ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే కోటాలో నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీలలో ఒకరు కనుక ఓడిపోతే అది మరింత దెబ్బ అవుతుందని, పైగా బాబు చాణక్యం గెలిచి సవాల్ చేసే సీన్ వస్తుందని వైసీపీలో కలవరం అయితే మొదలైంది. మరి ఈ నెల 23న ఏమి జరుగుతుందో చూడాలి. నిజానికి ఇది టీడీపీకి యాంటీ నంబర్ అని వైసీపీ సెటైర్లు వేస్తోంది. ఇపుడు ఈ నంబర్ చేసే మ్యాజిక్ ఏ పార్టీని హర్ట్ చేస్తుందో వేచి చూడాల్సిందే అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.