Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ చెప్పిన మాటలేంది? ఢిల్లీలో చేసిందేమిటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   13 Dec 2020 4:21 AM GMT
ఎన్నికల వేళ చెప్పిన మాటలేంది? ఢిల్లీలో చేసిందేమిటి కేసీఆర్?
X
కేంద్రంపై నిప్పులు చెరిగి నెల రోజులు కూడా కాలేదు. గ్రేటర్ లో ఎన్నికలైన వెంటనే.. జాతీయస్థాయిలో కూటమికి రంగం సిద్ధం చేస్తానని.. హైదరాబాద్ అందుకు వేదిక అవుతుందన్న మాటలు మాత్రమే కాదు.. దేశ రాజధాని శివారులో జరుగుతున్న రైతుల దీక్షకు మద్దతుగా భారత్ బంద్ ను అధికారికంగా జరిపి వారం రోజులు కాక ముందే హస్తినకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తాజాగా ప్రధాని మోడీతో భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరు ఒకరికొకరు మర్యాదపూర్వకంగా వంగి నమస్కారాలు పెట్టుకున్న ఫోటోల్ని తాజాగా భారీ ఎత్తున ప్రచురించటం తెలిసిందే.

దేశ ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా పరస్పరం నమస్కారాలు చేసుకోవటం తప్పేం కాదు. కాకుంటే.. ఎన్నికల వేళ.. గొంతు చించుకొని.. తన మాటలతో మంట పుట్టించిన కేసీఆర్.. ఎన్నికల్లో షాకింగ్ ఫలితాల వెంటనే ఢిల్లీకి వెళ్లి భేటీ కావటంపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకవేళ.. గ్రేటర్ లో ఆయన అంచనా వేసినట్లుగా 105 స్థానాల్ని గెలుచుకొని ఉంటే.. ఆయనీ పని చేసేవారా? అన్నది క్వశ్చనే.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పరిహారాన్ని పంపుతారని.. తెలంగాణ విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తారంటూ విరుచుకుపడిన కేసీఆర్.. అందుకు భిన్నంగా.. రాష్ట్రం తరఫు వినతుల చిట్టాను ప్రధాని మంత్రి ముందు పెట్టటం గమనార్హం. అంతేనా.. వరదబాధితులకు సాయం అందించేందుకు రూ.1300 కోట్లు అందించాలని తాను లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసి.. నిధులు విడుదల చేయాలని కోరారు.

తెలంగాణలో అమలు చేస్తున్న పలు ఫథకాలకు రూ.25వేల కోట్లు అందించాలని నీతిఆయోగ్ సూచించిందని.. ఆ విషయంలో సహకారం అందించాలని కోరటం గమనార్హం. ఇలా పలు వినతులతో ప్రధానిని కలవటాన్ని తప్పు పట్టలేం. అయితే.. తన మాటలకు చేతలకు మధ్య ఎంత అంతరం ఉంటుందన్న విషయాన్ని తాజా భేటీతో మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి.