Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ ఎంతంటే!

By:  Tupaki Desk   |   10 Jun 2022 8:30 AM GMT
రాష్ట్రపతి ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ ఎంతంటే!
X
భారతదేశ రాష్ట్రపతి పదవి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎవరెవరు రాష్ట్రపతికి ఓటేస్తారు. అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రపతి ఎన్నిక మిగతా ఎన్నికలతో పోలిస్తే కొంచెం భిన్నం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ మాదిరిగా రాష్ట్రపతికి ఓటు హక్కు ఉన్న ప్రజలు ఓట్లేయరు. రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో సాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక కథా క్రమం..

రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇందులో ఒక ఎంపీ ఓటు విలువను.. మొత్తం ఎన్నికైన రాష్ట్ర ఎమ్మెల్యేలు/ ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుతో లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఏపీలో 36 మంది ఎంపీలు (25 లోక్‌సభ+ 11 రాజ్యసభ) ఉన్నారు. వీరి మొత్తం ఓటు విలువ 25,488గా ఉంది. అయితే జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఆ మేరకు ఎంపీ ఓటు విలువ తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700 కు తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్జ జనాభా/ మొత్తం ఎమ్మెల్యేలు x 1000గా (1971 జనాభా లెక్కల ప్రకారం) లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా ఉంది. అంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 53,313గా ఉంది.

రాష్ట్రపతి ఎన్నికలో లోక్ సభ, రాజ్యసభకు ఎన్నికైన (ఎంపికైనవారు కాదు) సభ్యులతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర ఎంతవరకు అనేదానిపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 ఎమ్మెల్యేలు ఉండగా.. ఇందులో 151 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. మరో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేనకు చెందినవారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీల విషయానికి వస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కరు చొప్పున ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. వైఎస్సార్సీపీకి చెందిన లోక్‌సభ ఎంపీలు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948. అలాగే 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం అన్ని పార్టీలు కలిపి 53,313 ఓటు విలువ ఉండగా ఒక్క వైఎస్సార్‌సీపీయే రాష్ట్రపతి ఎన్నికలో 45,957 ఓట్ల విలువను దక్కించుకుంది.