Begin typing your search above and press return to search.

జేసీ కామెంట్ల వెనుక కథేంటి?

By:  Tupaki Desk   |   11 Jan 2020 7:48 AM GMT
జేసీ కామెంట్ల వెనుక కథేంటి?
X
జేసీ దివాకర్ రెడ్డి.. రాజకీయాల్లోనే విలక్షమైన నేత.. అప్పుడే తిడుతారు.. అప్పుడే మెచ్చుకుంటారు. సొంత పార్టీ అధినేత ముందే ఆయనను కడిగేస్తారు. అనంతరం మెచ్చుకుంటారు. ప్రత్యర్థి విషయంలోనూ అంతే. ఇలా అంతుచిక్కని రాజకీయం చేసే రాయలసీమ రెడ్డప్ప, మాజీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా జేసీ తమకు ప్రత్యేక రాయలసీమ నినాదం ఎత్తుకున్నారు. అయితే అమరావతియే రాజధానిగా ఉండాలంటున్నారు. పీఓకేను బీజేపీ సాధిస్తే ఆ పార్టీలోకి వెళతానంటున్నాడు. ఇలా జేసీ సంచలన కామెంట్లతో ఇటీవల కాలంలో హోరెత్తిస్తున్నారు. ఆయన అంతుచిక్కని రాజకీయం వెనుక అసలు కథేంటి అన్నది ఆసక్తిగా మారింది.

ఇటీవలే బీజేపీ పెద్దలను కలిసి జేసీ ఆ పార్టీతో చర్చలు జరిపారు. తద్వారా తన దివాకర్ బస్సులను సీజ్ చేసి కేసులతో తనను ఇబ్బంది పెడుతున్న జగన్ కు పరోక్ష హెచ్చరికలు పంపారు. తాను బీజేపీతో నరుక్కొస్తానని తద్వారా నిరూపించారు. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కూడా సీమలో సీనియర్ అయిన జేసీని వాడుకోవాలని స్కెచ్ గీస్తోందట.. ఇలా పరస్పరం జగన్ ను నియంత్రించడానికి జేసీ-బీజేపీ స్నేహం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇక గ్రేటర్ రాయలసీమ నినాదం జేసీ ఎత్తుకోవడం వెనుక జగన్ ను భయపెట్టే వ్యూహాన్ని అవలంభిస్తున్నారని తెలుస్తోంది. విశాఖ రాజధాని చేస్తే గ్రేటర్ సీమను జేసీ తెరపైకి తెచ్చేందుకు ఉద్యమిస్తున్నారు. ఇలా అటు బీజేపీని, ఇటు గ్రేటర్ రాయలసీమతో జగన్ తనను రాజకీయంగా టార్గెట్ చేయకుండా అష్టదిగ్బంధనం చేసేందుకే జేసీ సరికొత్త ఎత్తులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.