Begin typing your search above and press return to search.

ఏంటీ రూల్ 71?ఎందుకు జ‌గ‌న్‌ కు షాక్ త‌గిలింది?

By:  Tupaki Desk   |   22 Jan 2020 12:47 PM GMT
ఏంటీ రూల్ 71?ఎందుకు జ‌గ‌న్‌ కు షాక్ త‌గిలింది?
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు రాష్ట్ర శాస‌న‌మండ‌లిలో షాక్ త‌గిలింది. అసెంబ్లిలో ఆమోదం పొందిన‌ సీఆర్డీఏ-2014 చట్టం రద్దు - అభివృద్ధి వీకేంద్రీకరణ బిల్లు లను మండలి తిరస్కరించింది. మంగళవారం మండలి ప్రారంభ మెనప్పటి నుంచి రాత్రి పది గంటల వరకు ఐదు సార్లు వాయిదాల అనంతరం సుదీర్ఘంగా సాగిన శాసనమండలిలో పై రెండు బిల్లులకు సంబంధించి రూల్‌ 71 ఓటింగ్‌లో ప్రతిపక్ష టీడీపీ నెగ్గింది. సభలో రూల్‌ 71పై చర్చ జరిగే సందర్భంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపికి 27 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. టీడీపీ సభ్యులను అధికారపక్షం తమవైపు తిప్పుకున్నప్పటికి కేవలం 11 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రాజ‌కీయాల సంగ‌తి పక్క‌న‌పెడితే...రూల్ 71న అంద‌రిలో హాట్ టాపిక్ అయింది. ఇంత‌కీ ఏంటా రూల్‌? ఎలా ప్ర‌తిప‌క్షం ఈ నిబంధ‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంద‌నే విష‌యం ఆస‌క్తిక‌రమే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి చెందిన ప‌లు నిబంధనల్లో 71వ నిబంధన ఒక‌టి. ఈ నిబంద‌న ప్ర‌కారం - రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని ఈ నిబంధన శాసన మండలి సభ్యులకు క‌ల్పించింది. అంటే, ఏదైనా మంత్రిత్వ శాఖ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా సభ్యుడు చైర్మన్ అనుమతితో తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ఈ మేరకు సంబంధిత సభ్యుడు - సంబంధిత తీర్మానాన్ని లిఖితపూర్వక నోటీసు రూపంలో శాసన మండలి కార్యదర్శికి అందజేయాలి. అనంత‌రం దానిపై చ‌ర్చ‌ - ఓటింగ్ నిర్వ‌హిస్తారు.

నిబంధ‌న 71 ప్ర‌కారం - ఆ రోజు సభా కార్యకలాపాలు ప్రారంభం కావడానికి ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాలి. నోటీసు స్వీక‌రించిన మండ‌లి చైర్మ‌న్ స‌ద‌రు నోటీసు నిబంధనలకు అనుగుణంగానే ఉందని భావిస్తే.. దానిని చదివి సభలోని మిగతా సభ్యులకు వినిపించాలి. దీనికి ఎంత మంది మద్దతు ఇస్తున్నారో.. ఆయా సభ్యులంతా తమ తమ స్థానాల్లో నిలబడాలని కోరాలి. తీర్మానం నోటీసుకు అనుకూలంగా 20 మంది లేదా అంతకు మించి సభ్యులు అనుకూలంగా ఉంటే, సదరు తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలి. ఇలా సంబంధిత ప్ర‌క్రియల‌ను తెలుగుదేశం అనుస‌రించి నోటీసు ఇచ్చింది. రాజధాని మార్పుపై మంగళవారం రూల్‌-71 పై జరిగిన తెదేపా చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌ లో తెదేపా తన పంతం నెగ్గించుకుంది. తెదేపాకు అను కూలంగా-27, వ్యతిరేకంగా-13, తటస్థంగా-9 ఓట్లు వచ్చాయి