Begin typing your search above and press return to search.

బెయిల్ ఇచ్చిన బెల్ గ్రేడ్ కోర్టు.. నిమ్మగడ్డకు పెట్టిన కండీషన్ ఏమిటి?

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:52 AM GMT
బెయిల్ ఇచ్చిన బెల్ గ్రేడ్ కోర్టు.. నిమ్మగడ్డకు పెట్టిన కండీషన్ ఏమిటి?
X
తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు.. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విదేశాల్లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన్ను సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కోర్టు షరతుల మీద విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనకు బెయిల్ వచ్చినట్లుగా కొన్ని వర్గాలు చెబుతుంటే.. భారత విదేశాంగ శాఖ చొరవతో విడుదలైనట్లుగా మరికొందరు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

జులై 27న నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా బెల్ గ్రేడ్ ఉన్నత న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆయన్ను అదుపులోకి తీసుకోవటానికి కోర్టు అనుమతిచ్చింది. జులై 27న ఉదయం 8.20 గంటల నుంచి ఆయన నిర్భందం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిస్థితులను సమీక్షించిన తర్వాత నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉందని.. గరిష్ఠంగా ఏడాది వరకూ నిర్బంధాన్ని కొనసాగించేందుకు వీలున్నట్లు చెబుతున్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్ వాదనల్ని వినకుండా తక్షణం అదుపులోకి తీసుకునేలా చట్టాలు ఉన్నాయని ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదలైన నిమ్మగడ్డ.. అక్కడున్న చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ బెల్ గ్రేడ్ నగరాన్ని విడిచి పెట్టటానికి వీల్లేదని తెలుస్తోంది. బెల్ గ్రేడ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ముందస్తుగా ఇచ్చిన సమాచారానికి తగ్గట్లు తాను హైదరాబాద్ కు తిరిగి రాలేకపోతున్నట్లుగా నిమ్మగడ్డ పేర్కొన్నారు. అందుకు కోర్టు ఆ వివరాల్ని నమోదు చేసుకుంటున్నట్లుగా పేర్కొంది. వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో నిమ్మగడ్డ మూడో నిందితుడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. సీబీఐ కోర్టు షరతులతో బెయిల్ మంజూరైంది. 2018లో ఆయన్ను రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లేందుకు వీలుగా కోర్టు అనుమతులు ఇచ్చింది. నాటి నుంచి నేటి వరకూ పలు దేశాల్లో పర్యటించినప్పటికీ.. ఎప్పుడు ఎదురుకాని రీతిలో సెర్బియాలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.