Begin typing your search above and press return to search.

బాదేసింది బాబే అనుకుందాం.. నాలుగేళ్లుగా జగన్ బాబు చేస్తుందేంటి?

By:  Tupaki Desk   |   6 Feb 2023 9:00 PM GMT
బాదేసింది బాబే అనుకుందాం.. నాలుగేళ్లుగా జగన్ బాబు చేస్తుందేంటి?
X
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉత్తపుణ్యానికి మాటలు అనిపించుకునే సీనియర్ నేత ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు.. ఒక పార్టీ అధినేతగా సుపరిచితుడైన చంద్రబాబు. మిగిలిన అధినేతల మీద ఒక మాట అంటే.. వెంటనే నమ్మకపోవచ్చు. కానీ.. అదేం కర్మో కానీ.. చంద్రబాబు మాత్రం తరచూ మాట పడుతూనే ఉంటారు. అయినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా తన పోరును సాగిస్తూనే ఉంటారు. యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారాలోకేశ్ పాదయాత్ర చేపట్టటం తెలిసిందే.

తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతో పాటు.. జగన్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో రాష్ట్రంలో భారీగా ఉన్న పెట్రోల్.. డీజిల్ ధరలను ప్రస్తావిస్తూ.. సరిహద్దు జిల్లాలకు చెందిన వారు పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ పెట్రోల్.. డీజిల్ ను కొనుగోలు చేస్తున్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఈ బాదుడేంది? అంటూ భారీగా విమర్శలు చేయటం తెలిసిందే.

లోకేశ్ విమర్శల పదును జగన్ సర్కారుకు తాకినట్లుగా కనిపిస్తోంది. తమకు అలవాటైన అడ్డగోలు వాదనను తెర మీదకు తీసుకొచ్చేసి.. ఈ బాదుడు మొత్తం చంద్రబాబు పాపంగా తన వాదాన్ని వినిపిస్తున్నారు. ఇందుకోసం పస లేని లాజిక్కుల్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. ఈ వాదన విన్నోళ్లంతా వారు చెప్పిన మాటల్నే ప్రశ్నలుగా సంధిస్తున్న పరిస్థితి. ఇలాంటి పేలవపు వాదనతో మరింత ఆత్మరక్షణలో పడేలా చేసుకోవటం అవసరమా? అన్న మాట వినిపిస్తోంది.

జగన్ సర్కారు వాదన 1

చంద్రబాబు నాయుడి హయాంలోనూ అదే 31 శాతం వ్యాట్.. ఇప్పుడూ అదే వ్యాట్. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్.. డీజిల్ రెండింటిపైనా లీటరుకు రూ.4 అదనపు వ్యాట్ పెంచారు. ఇప్పుడు అదే వ్యాట్ కొనసాగుతుంది.

ప్రజల మాట

చంద్రబాబు వడ్డించాడు సరే. ఆ తీరు నచ్చకే కదా? భారీ మెజార్టీతో జగన్ కు అధికారాన్ని చేతికి ఇచ్చింది. మరి.. పెద్ద కొడుకు మాదిరిగా ఉంటానన్న వ్యక్తి.. చంద్రబాబు బాదే బాదుడ్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నట్లు? చంద్రబాబు ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నుంచి పలు పథకాల్ని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసివేయలేదా? అలానే పెట్రోల్.. డీజిల్ మీద బాబు బాదుడ్ని.. జగన్ బాబు ఎందుకు ఆపలేదు?

జగన్ సర్కారు వాదన 2

చంద్రబాబు ప్రభుత్వం నాటి వ్యాటే కొనసాగిస్తున్నాం. చంద్రబాబు హయాంలో రోడ్లను పట్టించుకోవటం మానేశారు. దారుణంగా మారిన రోడ్డ రిపేర్ల కోసం ప్రభుత్వం లీటరు డీజిల్.. పెట్రోల్ కోసం ఒక రూపాయి సెస్ ను మాత్రమే వసూలు చేస్తోంది.

ప్రజల మాట

వాత పెట్టి వెన్నపూసిన మాటకు మించినట్లుగా జగన్ సర్కారు మాటలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితికి.. జగన్ సర్కారు పవర్లోకి వచ్చిన తర్వాత పరిస్థితికి ఎంతలా మార్పు వచ్చిందన్న విషయం ఏపీ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. చివరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం.. ఒక సందర్భంలో ఏపీ రోడ్ల గురించి తన స్నేహితుడు ఏం చెప్పాడో చెప్పటం.. అది జగన్ సర్కారుకు సూటిగా తగటం తెలిసిందే.

అంటే.. జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా రోడ్లు దెబ్బతిన్నది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాదన్న విషయం అర్థమవుతుంది. అలాంటప్పుడు పాడైన రోడ్లను బాగు చేయటానికి.. ప్రజల మీద లీటరుకు రూపాయి చొప్పున భారం వేయటం ఏమిటి? బటన్ నొక్కి భారీగా సంక్షేమ పథకాల కోసం నిధులు వరద పారించే జగన్ సర్కారు.. రోడ్ల కోసం రూపాయి చొప్పున బాదకుండా బాగు చేయలేరా?

జగన్ సర్కారు వాదన 3

కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీలు.. సెస్ ల పేరుతో పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం వల్లే ఇంధన ధరలు భగ్గుమంటున్నాయన్న విషయం తెలియంది కాదు కదా? నిజం చెప్పాలంటే ఇంధన ధరలు రూపాయి అటుఇటుగా ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉన్నాయి.

ప్రజల మాట

నిజమే.. జగన్ అండ్ కో వినిపిస్తున్న వాదనలో పాక్షిక నిజం ఉంది. ఇంధన ధరలు అన్ని రాష్ట్రాల్లోనూ రూపాయి తేడాతోనే ఉన్నాయి. కానీ.. సర్వీసు ఛార్జి.. సెస్ లు పేరుతో ఏపీ.. తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వాల అదనపు బాదుడు కారణంగా లీటరు పెట్రోల్.. డీజిల్ ధరల్లో భారీ తేడా కనిపిస్తోంది. మరి.. ఈ కారణంగానే కదా? ఏపీ సరిహద్దు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకు యజమానులు బ్యానర్లు కట్టి మరీ.. తమ వద్ద లీటరు పెట్రోల్.. డీజిల్ కొంటే ఒరిగే లాభం ఎంతో చెబుతున్నారు కదా? ఒకవేళ.. లీటరుకు రూపాయే తేడా ఉంటే.. వారు బ్యానర్లు.. ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటారా? జనాలు వెళతారా?

జగన్ సర్కారు వాదన 4

పెట్రోల్.. డీజిల్ పై కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతమే. నేరుగా పన్నుల పేరుతో వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తోంది కాబట్టి సెస్ లు.. సర్ చార్జీలు.. అదనపు ఎక్సైజ్ డ్యూటీ .. అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం వసూలు చేస్తోంది. ఇందులో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వదు.

ప్రజల మాట

ఇలాంటి పంచాయితీలు కేంద్రం వద్ద తేల్చుకోవాలే తప్పించి.. ఆ పేరు చెప్పి ప్రజల మీద భారం మోపటం సరికాదు కదా? ఆ మాటకు వస్తే కేంద్రం అమలు చేయని ఎన్నో సంక్షేమ పథకాల్ని జగన్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది కదా? ఇలా తాయిలాలు ఇచ్చేందుకు వేలాది కోట్లు ఖర్చు చేసే జగన్ సర్కారు.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ వినియోగించే పెట్రోల్.. డీజిల్ మీద తాము వేసే అదనపు బాదుడ్ని ఆపేయరేం? అన్న ప్రశ్న తలెత్తుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.