Begin typing your search above and press return to search.

ఏమైంది సోమూ...మరీ ఇంత దారుణంగానా....?

By:  Tupaki Desk   |   28 Jan 2022 9:41 AM GMT
ఏమైంది సోమూ...మరీ ఇంత దారుణంగానా....?
X
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుకు ఉన్నట్లుండి ఏమైంది. తెల్లారితే రేపే అధికారం వచ్చి ఒడిలో పడిపోతుంది అని కలలు కంటున్నారా. లేక ఒవర్ నైట్ సూపర్ లీడర్ కావాలని ఆశ పడుతున్నారా. ఆయనకు మామూలుగానే బీజీపీలో ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. అయినా సరే ఒకపుడు కొంత ఆచీ తూచీ మాట్లాడారు. బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాకా కూడా కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేశారు.

కానీ ఇపుడు చూస్తే మాత్రం సోము బాగా నోరు చేసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని, వైసీపీని సిద్ధాంతాల‌ మేరకు ప్రజా సమస్యల విషయంలో గట్టిగానే విమర్శించవచ్చు. అందులో తప్పు లేదు. కానీ ఆ పేరుతో ఏకంగా ఒక జిల్లాను, ప్రాంతాన్ని కూడా పట్టుకుని దారుణమైన కామెంట్స్ చేస్తే ఎలా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.

విశాఖ జిల్లా టూర్లో సోము వీర్రాజు కడప జిల్లా గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. కడప వాళ్ళకు ఎయిర్ పోర్టు ఎందుకు అని మాట్లాడడమే పెద్ద తప్పు. వాళ్ళకు ప్రాణాలు తీయడమే వచ్చు, అక్కడ ఎయిర్ పోర్టు అవసరమా అన్నట్లుగా సోము మాట్లాడుతున్న మాటలు నిజంగా దారుణం, బాధాకరమని అంటున్నారు.

కడప అంటే అంతా హత్యలు చేసేవారే ఉంటారా సోమూ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అసలు కడప వాసులు అంటే ఎందుకు అంత చులకన అన్న మాట కూడా వస్తోంది. అక్కడ నుంచి ఎందరో కవులు కళాకారులు వచ్చారు. ఈ రోజుకూ ఉన్నారు. కడపలో పుట్టిన వాళ్ళు అంతా హత్యలు చేసేవారే అని ఎలా సోము డిసైడ్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

ఆ జిల్లాలో అసలు సాత్విక జనులే ఉండరనా సోము భావన అని కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆయన ఏ అర్ధంతో మాట్లాడినా కూడా ఇదే తప్పే అన్న మాట వినిపిస్తోంది. సోము వెంటనే తన వ్యాఖ్యలను కరెక్ట్ చేసుకోవాలని కూడా డిమాండ్ వస్తోంది. ఇక మరో వైపు చూస్తే సోము తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండ్ సంజయ్ ని స్పూర్తిగా తీసుకుని నోటికి పని చెబ్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ బండి గట్టిగా మాట్లాడుతూ పొలిటికల్ అటెన్షన్ తన వైపు ఎలా తిప్పుకున్నారో ఇపుడు సోము కూడా అదే ప్రాక్టీసులో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ సర్కార్ ఎయిర్ పోర్టులు జిల్లాకు ఒకటి పెడతామని చెప్పడంలో తప్పు ఏముంది అన్న వారూ ఉన్నారు. అరే రెండేళ్ళుగా ఏపీలో అభివృద్ధి లేదు, దాని మీద మాట్లాడవచ్చు. ముందు అభివృద్ధి చేయండి ఆనక ఎయిర్ పోర్టులు కట్టండి అని కూడా చెప్పవచ్చు, కానీ నీకెందుకు ఎయిర్ పోటులు కట్టడం అని ప్రభుత్వాన్ని హేళ‌న చేయడంతో పాటు, కడప వంటి జిల్లాలకు ఎయిర్ పోర్టు కావాలా. బస్సులు కూడా వెళ్ళలేని ఇరుకు రోడ్ల కర్నూల్ కి ఎందుకు ఎయిర్ పోర్టు వంటి మాటలు సోము నోట రావడమే దారుణమని అంటున్నారు.

మొత్తానికి ఈ మధ్యనే యాభై రూపాయలకు చీప్ లిక్కర్ తాము పవర్ లోకి వస్తే ఇస్తామని చెప్పుకున్న సోము దాని దెబ్బకు పూర్తిగా ట్రోల్ అయ్యారు. ఇపుడు కాస్తా రూట్ మార్చి మళ్ళీ వివాదంలో చిక్కుకున్నారు అంటున్నారు. ఇంతకీ ఏమైంది సోమూ అని నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు. వైసీపీ మద్దతుదారులు అయితే సోము మీద దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా సోము నోరు చేసుకున్న పుణ్యమే అంటున్నారుట.