Begin typing your search above and press return to search.

గాల్వాన్ ఘర్షణ ...జూన్ 15 రాత్రి ఏం జరిగింది ?

By:  Tupaki Desk   |   22 Jun 2020 6:30 AM GMT
గాల్వాన్ ఘర్షణ ...జూన్ 15 రాత్రి ఏం జరిగింది ?
X
కల్నల్ సంతోష్ బాబు ప్రస్తుతం దేశం మొత్తం తలుచుకుంటున్న పేరు. గాల్వాన్ వ్యాలీలో భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు. సంతోష్ బాబు తో సహా ఆ ఘర్షణ లో 20 మంది జవాన్లు అమరులయ్యారు. జూన్ 15వ తేదీన సంతోష్ బాబు ఎలాంటి సాహసాన్ని ప్రదర్శించారు. ముందుండి తన ట్రూప్స్‌ ను ఎలా నడిపారు..ఆ రోజు రాత్రి ఏం జరిగింది.

కల్నల్ సంతోష్ బాబు.. భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరుడయ్యారు. జూన్ 15వ తేదీ రాత్రి వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణలో చైనా ఆక్రమణను ప్రశ్నించారు. చైనా బలగాలు వాస్తవ నియంత్రణ రేఖ దగ్గరకు చొచ్చుకు వస్తున్న సమయం లో వారితో చర్చలు జరిపారు. ఎంతో మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతూనే రేఖ దాటి రావొద్దనే విషయంపై చాలా బలంగా నిలబడ్డారు. కానీ డ్రాగన్ కంట్రీ బలగాలు మాత్రం మర్యాద తప్పి ప్రవర్తించాయి. కల్నల్ ‌పై రాళ్లు రువ్వారు. అయినప్పటికీ ఆ ప్రదేశం నుంచి కల్నల్ సంతోష్ బాబు వెళ్లలేదు సరికదా మరింతగా అడ్డుకున్నారు. అంతేకాదు తన బృందంతో పాటు అక్కడే ఉన్నాడు.

బీహార్ ఇన్ ‌ఫాంటరీ 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ‌గా ఉన్నారు కల్నల్ సంతోష్ బాబు. గాల్వాన్‌ వ్యాలీలో 14వ పాట్రోలింగ్ పాయింట్‌ కు అవతలే చైనా బలగాలు ఉండేలా చూడాలని కల్నల్ సంతోష్ బాబుకు టాస్క్ అప్పగించడం జరిగింది. చైనా బలగాలు అక్కడ నుంచి వెనక్కు మళ్లిన తర్వాత వ్యక్తిగతంగా తాను నివేదిక ఇవ్వాలని పై అధికారులు సూచించారు.ఇక చర్చలు ముగిసిన తర్వాత చైనా బలగాలు అక్కడి నుంచి వెనక్కు మళ్లాయి. వారి టెంట్లను అక్కడ నుంచి తొలగించాయి. ఆ సమయంలో కల్నల్ సంతోష్ బాబు కూడా తన ర్యాంకు స్థాయి చైనీస్ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం.

అయితే జూన్ 14 ఒక్క సారిగా చైనా బలగాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఒక పోస్టును ఏర్పాటు చేశాయి. అయితే ఇది అక్రమం అని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కల్నల్ సంతోష్ బాబు చైనా సైనికాధికారులతో వాదించారు. జూన్ 6వ తేదీన జరిగిన చర్చల మేరకు నడుచుకోవాలని పదేపదే చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తితే మేజర్ ర్యాంక్ స్థాయి ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సి ఉంటుందని సమాచారం. అయితే కల్నల్ సంతోష్ బాబు ముందుండి చొరవ తీసుకుని తన టీమ్‌తో అక్కడకు చేరుకున్నారు. తీరా అక్కడకు చేరుకోగానే కల్నల్ ఒక విషయాన్ని గమనించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు అక్కడ గస్తీ ఉండే చైనా సైనికులు కాకుండా కొత్త వారు అక్కడ ఉండటం గమనించారు. వీరంతా స్వల్ప వ్యవధికాలంలోనే అక్కడకు చేరుకున్నారు.

భారత సైనికులు రోజు మాట్లాడే చైనా సైనికులు వారు కాదని గుర్తించారు. అక్కడ పోస్టును ఎందుకు ఏర్పాటు చేశారని కల్నల్ సంతోష్ బాబు ప్రశ్నించారు.కల్నల్ సంతోష్ బాబు ప్రశ్నించడంతో వెంటనే చైనా సైనికుడు ఒకడు కల్నల్ బాబును తోసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు చైనీస్ భాషలో దూషించినట్లు కూడా సమాచారం. తమ కమాండింగ్ ఆఫీసర్‌పై చైనా సైనికుడు చేయి చేసుకోవడం చూసిన సైనికుల రక్తం మరిగిపోయింది. అయితే సంయమనం పాటించాలని కల్నల్ సంతోష్ బాబు వారికి సూచించారట. ఇక చైనీస్ బలగాలు జవాన్లపై రాడ్లతో దాడికి దిగడంతో భారత జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు. ఇక అప్పటికే చీకటి పడిపోయింది. దీంతో అప్పటికే భారీ సంఖ్యలో గాల్వాన్ నది తీరంలో నక్కి ఉన్న చైనా బలగాలు ముందుకొచ్చాయి. భారత జవాన్లపై రాళ్లతో దాడి చేశారు.

రాత్రి 9 గంట సమయంలో కల్నల్ సంతోష్ బాబు తలకు ఓ భారీ సైజులో ఉన్న రాయి తగలడంతో ఒక్కసారిగా నదిలోకి పడిపోయారు. అయితే కల్నల్ సంతోష్ బాబును లక్ష్యంగా చేసి దాడి చేసినది కాదనే వాదన వినిపిస్తోంది. వరుసగా రాళ్లదాడి చేసినప్పుడు అందులో ఒకరాయి కల్నల్ తలకు తగిలి ఉంటుందనే అంచనా.ఇక రెండో ఘర్షణ దాదాపు 45 నిమిషాలపాటు సాగింది. ఇక ఈ సమయంలోనే మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘర్షణ వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల జరిగాయి. ఈ సన్నివేశం ఎవరైనా చూస్తే రెండు వర్గాలు గొడవపడుతున్నారేమో అన్నట్లుగా ఉన్నిందట. దాదాపు 300 మంది బృందాలుగా విడిపోయి దాడి చేశారు. ఇక ఘర్షణ ముగియడంతో ఇటు భారత్ అటు చైనా సైనికుల మృతదేహాలు నదిలో పడిపోయాయని తెలుస్తోంది. వీరిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహంతో పాటుగా ఇతర జవాన్ల పార్థీవదేహాలను కూడా నదిలోనుంచి భారత భూభాగంలోకి సైనికులు తీసుకొచ్చారు