Begin typing your search above and press return to search.

అందుకే కేసీఆర్ ప్రతిసారి భోజనం అని ఒత్తి పలుకుతారట

By:  Tupaki Desk   |   27 July 2021 1:30 AM GMT
అందుకే కేసీఆర్ ప్రతిసారి భోజనం అని ఒత్తి పలుకుతారట
X
రాజకీయం.. భావోద్వేగం బద్ధ శత్రువులుగా అభివర్ణిస్తారు. నిజమే.. కారుణ్యానికి ఏ మాత్రం అవకాశం లేని కాఠిన్యతను నిండి ఉండే రాజకీయాల్లో భావోద్వేగాల్ని ప్రదర్శిస్తే.. అధినాయకుడిగా ఎదగటం కష్టమే కాదు.. ఉన్నశిఖరాలకు ఎదగటానికి అదో అవరోధంలా మారుతుందన్న విషయం తెలిసిందే. మరి.. అదే రాజకీయాల్లోకి వ్యూహాత్మకంగా భావోద్వేగాన్ని ఫార్ములాగా జేరిస్తే కలిగే ప్రయోజనం అంతా ఇంతా కాదు. సరిగా అర్థం కాలేదా? మరింత వివరంగా చెబుతాం.

భావోద్వేగంగా వ్యవహరించే వారెవరైనా సున్నిత మనస్కులుగా ఉంటారు. ప్రతి చిన్నదానికి ఇట్టే రియాక్టు అవుతారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు మరీ ఇంత సున్నితంగా ఉంటే తిప్పలే. అదే సమయంలో.. కఠినంగా ఉంటూనే.. సమయానికి అనుగుణంగా భావోద్వేగానికి గురైనట్లుగా వ్యవహరిస్తూ.. తన మాటల్లో మెలోడ్రామాను ఏ మాత్రం మిస్ కాకుండా వ్యవహరించే నేతలకు తిరుగు ఉండదు. అలాంటి లక్షణాలన్ని పోతపోసినట్లుగా కేసీఆర్ లో కనిపిస్తాయి. గులాబీ అధినేత మాటల్లో వినిపించినంత భావోద్వేగం.. అన్ని సందర్భాల్లో అసలు కనిపించదు. ఆ మాటకు వస్తే.. తెలుగు నేలను ఏలిన ముఖ్యమంత్రుల్లో సమయానికి తగ్గట్లు అత్యంత కఠినంగానూ.. అత్యంత భావోద్వేగంతో వ్యవహరించే నేతల్లో కేసీఆర్ కు దగ్గరకు వచ్చే వారెవరూ కనిపించరు.

తన వ్యూహాత్మక రాజకీయాలకు సరిపోయేలా ప్రగతిభవన్ అవసరాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లే నిర్మించిన ఆయన.. ఇప్పుడా ప్రయోజనాన్ని పొందుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గం నుంచి వందలాది మందిని తన అధికారిక నివాసానికి పిలిపించుకొని.. వారితో గంటల కొద్దీ మాట్లాడటం.. వారందరితో కలిసి భోజనం చేయటం లాంటివి కనిపించవు. మంత్రులకు సైతం తనకు నచ్చినప్పుడు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చే కేసీఆర్.. అందుకు పూర్తి విరుద్ధంగా.. ఎక్కడో మారుమూలన ఉన్న గ్రామంలో తన భార్యకు ఎంపీటీసీ ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవటంలో ఫెయిల్ అయిన వ్యక్తిని గుర్తించి మరీ ఫోన్ చేయటం.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రగతిభవన్ కు రావాలని కోరటం లాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.

తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఎవరినైనా ప్రగతిభవన్ కు రమ్మని ఆహ్వానించిన ప్రతి సందర్భంలోనూ.. భోజనం చేద్దామనో.. భోజనం చేయాలన్న మాట తప్పనిసరిగా కేసీఆర్ నోటి నుంచి కనిపిస్తుంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అధినేత.. తమను భోజనానికి పిలవటానికి మించిన గుర్తింపు ఇంకేం ఉంటుంది. ఒక సగటుజీవి ఈ విషయాన్ని తన జీవితాంతం మర్చిపోరు. ఇలా భావోద్వేగంతో తనకు కనెక్టు అయ్యేలా చేస్తూనే.. మరోవైపు కఠినాతి కఠినంగా వ్యవహరించటం కేసీఆర్ కే చెల్లుతుంది. మాస్ సైకాలజీని చూస్తే.. ప్రోగ్రాం ఏదైనా సరే.. చివర్లో భోజనం ఉంటుందన్న మాట ఎంతలా కట్టిపారేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది రాజప్రసాదం లాంటి ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి సరసన భోజనం చేయటానికి మించింది ఏముంటుంది?

ఇలాంటివి ఎంతటి మైలేజీని తెచ్చి పెడతాయో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే..ఆయన ఎవరితో మాట్లాడిన సందర్భంలో కానీ.. బహిరంగ సభల్లో కానీ ప్రగతిభవన్ లో కలిసినా.. లేదంటే పెద్ద ప్రోగ్రాం పెట్టాలనుకున్నప్పుడు భోజనం ప్రస్తావనను తీసుకొస్తారు. తన మాటలతో కడుపు నింపేలా చేస్తారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. రాజకీయాన్నికాసేపు పక్కన పెట్టేస్తే.. కేసీఆర్ కానీ అతిధ్యానికి పిలిచారంటే చాలు.. ఆయన ఏర్పాటు చేసే విందును జీవితంలో మర్చిపోలేరని చెబుతారు. అది ఏ స్థాయి వారికైనా.. వారి అంచనాలకు మించి ఉంటుందని చెబుతారు. నిజానికి అదే కేసీఆర్ బలంగా.. మిగిలిన వారి బలహీనతగా చెబుతారు. మందిని సరిగా మదింపు చేసే సత్తా ఉన్నోళ్లే కదా.. వారి మీద స్వారీ చేయగలిగే అర్హతను సంపాదిస్తారు.