Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ పై పలు అధ్యయనాలు ఏమంటున్నాయంటే..?

By:  Tupaki Desk   |   23 Dec 2021 3:30 PM GMT
ఒమిక్రాన్ పై పలు అధ్యయనాలు ఏమంటున్నాయంటే..?
X
ఇప్పుడు ఎవరిని పలకరించినా... వైరస్ మళ్లీ వస్తుందట కదా. ఏదో ఒమిక్రాన్ వల్ల కేసులు పెరుగుతున్నాయట కదా. కరోనా వల్ల మళ్లీ లాక్ డౌన్ వస్తదా? అనే మాటలే. అంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వల్లే జనాలకు నానా సందేహాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఈ వేరియంట్ కు త్వరగా వ్యాప్తి చెందే గుణాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ సహా పలు వైద్య నివేదికలు వెల్లడించాయి.

అయితే ఇది ఇప్పటికే దాదాపు 106 దేశాలకు ఎగబాకింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఒమిక్రాన్ ప్రభావంపై పలు సంస్థలు అధ్యయనాలు చేశాయి. అందుకు సంబంధించిన నివేదికలను ప్రచురించాయి.

కాగా మెజారిటీ అధ్యయనాల్లోనూ ఒమిక్రాన్ తీవ్రత తక్కువే ఉంటుందని తేలింది. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ బారిన పడితే ఆస్పత్రుల్లో చేరే అవకాశం తక్కువే ఉంటుందని వారు తేల్చారు.

హాస్పిటల్ లో చేరాల్సిన అవకాశం డెల్టాతో పోల్చితే 70 నుంచి 80 శాతం వరకు తక్కువే ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోగ నిరోధక శక్తిని బాగా కలిగి ఉన్నవారికి అసలు ఇది సోకినట్లు గుర్తించలేరని చెప్పారు. కేసులు పెరుగుతాయి తప్పితే... వారిపై దీని ప్రభావం తక్కువే ఉంటుందని నివేదికల్లో పొందు పర్చారు. వారు చేసిన పరిశోధనల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు.

ఇక ఒమిక్రాన్ ప్రభావం డెల్టా కన్నా చాలా తక్కువ ఉంటుందని అనేక దేశాలకు చెందిన అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా వైరస్ అనేక రూపాంతరాలు చెందుతూ వస్తోంది. క్రమంగా వైరస్ సామర్థ్యం కూడా క్షీణిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే దాని ప్రభావం కూడా కోల్పోతుందని నిపుణులు అంచనా వేశారు.

కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కు వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంది కానీ... తీవ్రత చూపించలేదని చెబుతున్నారు. ఇక ఐసీయూల్లో చికిత్స అవసరమైన వారు కూడా డెల్టాతో పోల్చితే చాలా తక్కువ శాతం మంది ఉంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. వారు కూడా అతి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారు మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఒమిక్రాన్ ప్రాథమిక లక్షణాల తీవ్రత కూడా తక్కువగానే ఉందని అధ్యయనాల్లో వెల్లడైంది. చాలాస్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉండబోదని చెబుతున్నారు. ఇకపోతే కొవిడ్... మహమ్మారి నుంచి సాధారణ స్థితికి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు.

సాధారణ జలుబుగా మారిపోయిందని చెబుతున్నారు. కావున పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. వైరస్ ప్రభావం క్షీణించింది. మరోవైపు వ్యాక్సినేషన్ తో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. కాబట్టి పెద్దగా ముప్పు ఉండదని నిపుణులు అంటున్నారు. వైరస్ తొలుత.. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి... శ్వాసవ్యవస్థను దెబ్బతీసేది. ఫలితంగా ప్రాణాపాయం ఉండేది. అయితే ప్రస్తుతం రూపాంతరం చెందడం వల్ల ఆ ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు.

ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినప్పటికీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదే అదునుగా భావించి నిర్లక్ష్యం వహించకూడదని చెబుతున్నారు. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి సురక్షితంగా ఉండగలమని చెబుతున్నారు. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి వేడుకల ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు పాటించడం అన్నివిధాలుగా మంచిదని వైద్య నిపుణులతో పాటు అధికారులు సైతం సూచిస్తున్నారు.