Begin typing your search above and press return to search.

భారతరత్న పొందిన వారికి వచ్చే సౌకర్యాలు ఏవి ? ఎవరు సిఫార్సు చేస్తారు?

By:  Tupaki Desk   |   28 July 2021 5:02 AM GMT
భారతరత్న పొందిన వారికి వచ్చే సౌకర్యాలు ఏవి ? ఎవరు సిఫార్సు చేస్తారు?
X
భార‌త‌ర‌త్న‌....భారతరత్న దేశం అత్యున్నత పురస్కారం. ఇది సాధించిన తరువాత దేశంలో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా గౌరవ, మర్యాదలు పొందుతారు. కానీ ఈ పురస్కారం సాధించడం ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. ఒక వ్యక్తి దీనిని పొందిన తర్వాత అతడికి ఇక ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ అవార్డు దేశానికి చేసిన సేవ కోసం అందిస్తారు. కళలు, సాహిత్యం, ప్రజా సేవ, క్రీడలకు భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డును స్థాపించిన సమయంలో మరణానంతరం ఇవ్వడానికి నియమం లేదు. కానీ, 1955 తరువాత దీన్ని మరణానంతరం కూడా ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది.

అయితే ఈ అత్యున్నత పురస్కారం పొందిన వ్యక్తికి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుందో ఒక్కసారి చూస్తే ...ఈ అవార్డు ఇవ్వడం 1954 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి చాలా మంది ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాంని కూడా ఈ అవార్డుతో సత్కరించారు. ఇవే కాకుండా సచిన్ టెండూల్కర్, పండిట్ భీమ్సేన్ జోషి, ప్రసిద్ధ శాస్త్రవేత్త సిఎన్ ఆర్ రావుతో సహా పలువురు ప్రముఖులు ఈ గౌరవాన్ని పొందారు. భారతీయులు కాని వారిలో మదర్ థెరిసా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా భారత్ రత్న అవార్డులు అందుకున్నారు.

ఇకపోతే ఏ వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనే సిఫారసును ప్రధాని.. రాష్ట్రపతికి సిఫార్స్ చేస్తారు. అప్పుడు రాష్ట్రపతి నుంచి అనుమతి పొందిన తరువాత ఆ వ్యక్తికి భారతరత్న ప్రదానం చేస్తారు. ఈ గౌరవం పొందిన ప్రజలకు ఈ క్రింది సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తాయి. భారతరత్న గ్రహీతలకు ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ ప్రకటిస్తారు. దీనితో పాటు ఒక ఆకు ఆకారాన్ని పోలి ఉండే ట్యాగ్ అతనికి అందిస్తారు. భారతరత్నానికి లభించే పతకంపై సూర్యుడి గుర్తు ఉంటుంది. హిందీలో దానిపై భారతరత్న అని, వెనకాల అశోక చిహ్నంతో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఈ పురస్కారంతో నగదు బహుమతి ఉండదు. భారతరత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది.

ఇందులో భారతరత్న పొందిన వ్యక్తి రైల్వేలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది కాకుండా ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసును కూడా ఉచితంగా అందిస్తుంది. భారత్ రత్న అందుకున్న వ్యక్తికి ప్రభుత్వం ‘వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీ’లో స్థానం ఇస్తుంది. ఇది ఒక రకమైన ప్రోటోకాల్. భారతరత్న అవార్డు గ్రహీత విజిటింగ్ కార్డులో గౌరవం పేరు రాసుకోవచ్చు. మొద‌టి సారిగా 1954 జ‌న‌వ‌రి 2వ తేదీన అప్ప‌టి భార‌త రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ భార‌త‌ర‌త్న అవార్డుకు శ్రీ‌కారం చుట్ట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 45 మంది ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఇక వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉండ‌డం విశేషం.

భార‌త‌ర‌త్న పుర‌స్కారం పొందిన వారి జాభితా ను ఒకసారి చూస్తే ...

1954వ సంవ‌త్స‌రంలో ముగ్గురికి భార‌త ర‌త్న ప్ర‌దానం చేశారు. డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌, చ‌క్ర‌వ‌ర్తుల రాజ‌గోపాలాచారి, డాక్ట‌ర్ సీవీ రామ‌న్‌ల‌కు ఆ ఏడాది ఈ అవార్డును అందించారు.1955వ సంవ‌త్స‌రంలో డాక్ట‌ర్ భ‌గ‌వాన్ దాస్‌, డాక్ట‌ర్ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌, జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూల‌కు భార‌త‌ర‌త్న ల‌భించింది.1957లో గోవింద్ వ‌ల్ల‌భ్ పంత్‌కు, 1958లో ధొండొ కేశ‌వ కార్వేకు, 1961లో డాక్ట‌ర్ బీసీ రాయ్‌, పురుషోత్త‌మ దాస్ టాండ‌న్‌ల‌కు భార‌త ర‌త్న‌ను ప్ర‌దానం చేశారు.

1962లో రాజేంద్ర ప్ర‌సాద్‌కు, 1963లో డాక్ట‌ర్ జాకీర్ హుస్సేన్‌, పాండురంగ వామ‌న్ కానేల‌కు భార‌త‌ర‌త్న ఇచ్చారు. 1966లో లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇచ్చారు. ఇందిరాగాంధీకి 1971లో, వీవీ గిరికి 1975లో ఈ అవార్డును ప్ర‌దానం చేశారు.1976లో కె.కామ‌రాజుకు మ‌ర‌ణానంత‌రం భార‌త‌ర‌త్న ఇచ్చారు. 1980లో మ‌ద‌ర్ థెరిసాకు ఈ అవార్డు ఇచ్చారు. ఇక 1982లో ఆచార్య వినోభాభావే మృతి చెంద‌గా ఆయ‌న‌కు 1983లో భార‌త‌ర‌త్న ఇచ్చారు. అలాగే 1987లో ఖాన్ అబ్దుల్ గ‌ఫార్ ఖాన్‌కు ఈ అవార్డు ల‌భించింది. ఎంజీ రామ‌చంద్ర‌న్ 1987లో క‌న్నుమూయ‌గా ఈయ‌న‌కు 1988లో భార‌త‌రత్న ఇచ్చారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 1956లో క‌న్నుమూయ‌గా ఈయ‌న‌కు 1990లో భార‌త‌ర‌త్న ఇచ్చారు.

నెల్స‌న్ మండేలాకు 1990లో, రాజీవ్ గాంధీకి ఆయన మ‌ర‌ణానంత‌రం 1991లో, స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ కు ఆయ‌న మ‌ర‌ణానంత‌రం 1991లో, మొరార్జీ దేశాయ్‌కు 1991లో భార‌త‌ర‌త్న ప్ర‌దానం చేశారు. 1958లో మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ మ‌ర‌ణించ‌గా ఆయ‌న‌కు 1992లో భార‌త‌ర‌త్న ఇచ్చారు. అలాగే జేఆర్‌ డీ టాటా, స‌త్య‌జిత్ రే, సుభాష్ చంద్ర‌బోస్‌ ల‌కు 1992లో భార‌త‌ర‌త్న ఇచ్చారు. కాగా సుభాష్ చంద్ర‌బోస్‌ కు ఇచ్చిన భార‌త‌ర‌త్న అవార్డును ప‌లు కార‌ణాల వ‌ల్ల ఉప‌సంహరించుకున్నారు. అరుణా అసఫ్ అలీ 1995లో మృతి చెంద‌గా 1997లో భార‌త‌ర‌త్న ఇచ్చారు. అలాగే అదే ఏడాది డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం, గుర్జారీలాల్ నందాల‌కు భార‌త‌ర‌త్న ల‌భించింది. 1998లో ఎంఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, సి.సుబ్ర‌హ్మ‌ణ్యం, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌ ల‌కు భార‌త‌ర‌త్న ఇచ్చారు. 1999లో ర‌విశంక‌ర్‌, అమ‌ర్త్య‌సేన్‌, గోపీనాథ్ బొర్దొలాయిల‌కు ఈ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేశారు. 2001లో ల‌తా మంగేష్క‌ర్‌, బిస్మిల్లాఖాన్‌ ల‌కు, 2008లో భీన్ సేన్ జోషికి, 2014లో స‌చిన్ టెండుల్క‌ర్‌, సీఎన్ ఆర్ రావుల‌కు భార‌త‌ర‌త్న ల‌భించింది. 2015లో మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వ్యా, అట‌ల్ బిహారీ వాజ్‌పేయికి భార‌త‌ర‌త్న ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మదన్ మోహన్ మాలవీయ, సచిన్ టెండుల్కర్.