Begin typing your search above and press return to search.

ఇకపై బీజేపీకి కష్టమేనా ?

By:  Tupaki Desk   |   14 April 2021 9:19 AM GMT
ఇకపై బీజేపీకి కష్టమేనా ?
X
హోరా హోరీగా జరుగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఇప్పటికి నాలుగు దశల పోలింగ్ పూర్తయ్యింది. గెలుపు నాదంటే నాదే అంటు ఇటు మమతాబెనర్జీ అటు నరేంద్రమోడి+అమిత్ షా నానా రచ్చ చేస్తున్నారు. ఒకళ్ళని మరొకళ్ళు దెబ్బ కొట్టేందుకు అవకాశం ఉన్నంతమేర మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. దానికితోడు నాలుగు దశల్లో పోలింగ్ భారీగా నమోదైంది. దాంతో 294 అసెంబ్లీ సీట్లకు సంబంధించి సగంసీట్లలో జనాలు ఎలాంటి తీర్పిచ్చారో అర్ధంకాక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

అయితే జరిగిపోయిన నాలుగుదశల పోలింగ్ తో పోల్చుకుంటే జరగబోయే మిగిలిన నాలుగు దశల పోలింగ్ బీజేపీకి కష్టమేని అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే నాలుగు దశల పోలింగ్ అంటే బెంగాల్ ఉత్తరప్రాంతంలోని సీట్లట. ఇక్కడ కమలంకు ఎదురుగాలి వీస్తున్నట్లు గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం)నేత బిమల్ గురంగ్ చెప్పారు. మళ్ళీ ఈ ప్రాంతంలోని 8 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా కీలకమైనవని గురంగ్ అభిప్రాయపడ్డారు.

తమ మద్దతు కారణంగానే ఉత్తర ప్రాంతంలోని 8 లోక్ సభ స్ధానాల్లో 2019లో బీజేపీ 7 సీట్లలో గెలిచిందట. ఇక్కడ సమస్య ఏమిటంటే గూర్ఖాల్యాండ్ ప్రాంతానికి ప్రత్యేకరాష్ట్రం హోదా ఇస్తానని చాలాకాలంగా కమలంపార్టీ నెట్టుకొస్తోందట. గూర్ఖాల్యాండ్ కు ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రహోదా ఇవ్వకపోగా మొన్నటి నాలుగోదశ పోలింగ్ లో సీఆర్పీఎఫ్ దళాలు ఓటర్లపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. సీఆర్పీఎఫ్ అంటే కేంద్ర బలగం అన్న విషయం అందరికీ తెలిసిందే.

హోంశాఖ మంత్రి అమిత్ షా పరిధిలోకే సీఆర్పీఎఫ్ కూడా వస్తుంది. దాంతో ఉత్తరప్రాంతంలో జనాలు మోడి+అమిత్ షా పై మండిపోతున్నారట. బీజేపీ ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్ధులందరు ఓడిపోవటం ఖాయమని గురంగ్ జోస్యం చెప్పారు. గురంగ్ చెప్పిన ప్రకారం చూస్తే మిగిలిన నాలుగుదశల పోలింగ్ లో బీజేపీకి ఎదురుగాలి తప్పదనే అనిపిస్తోంది. ఇది వాస్తవమే అయితే దీదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అనుకోవాలి.