Begin typing your search above and press return to search.

శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ షాక్

By:  Tupaki Desk   |   28 Jun 2017 6:17 AM GMT
శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ షాక్
X
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సేవ - సౌకర్యాలకే తొలి ప్రాధాన్యమిచ్చే టీటీడీ ఎందుకో కానీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎన్నో ప్రయాసలు పడి కాలినడకన ఏడు కొండలు ఎక్కి దేవదేవుడిని దర్శించుకోవాలనుకునేవారికి దివ్యదర్శనం పేరిటి ఇంతకాలం ప్రత్యేక క్యూ లైన్ నిర్వహిస్తూ వేగంగా దర్శనభాగ్యం కల్పిస్తున్న టీటీడీ ఇప్పుడా సౌకర్యాన్ని ఆపేయాలని నిర్ణయించింది.

కాలినడక మార్గాల్లో వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఈ సదుపాయాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. సాధారణ భక్తులకు 10 నుంచి 18 గంటల సమయం పట్టే వేళ - దివ్యదర్శనం భక్తులు 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే దర్శనం ముగించుకుని బయటకు వస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో దివ్యదర్శనానికి డిమాండ్ గణనీయంగా పెరిగి అలిపిరి - శ్రీవారి నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ముఖ్యంగా వారాంతాల్లో నడిచి వచ్చే వారి సంఖ్య 35 వేల వరకూ ఉంటుండటంతో 'దివ్యదర్శనం' టోకెన్ల జారీని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది.

తొలి దశలో శుక్ర - శని - ఆది వారాల్లో టోకెన్ల జారీని నిలుపుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని ప్రకటించారు నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలిపారు. కాగా, వారాంతాల్లో లక్ష నుంచి లక్షా 20 వేల మంది వరకూ నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/