Begin typing your search above and press return to search.

అమరావతి ని అభివృద్ధి చేస్తాం: బొత్స

By:  Tupaki Desk   |   10 Jan 2020 3:47 AM GMT
అమరావతి ని అభివృద్ధి చేస్తాం: బొత్స
X
అమరావతి ఉద్యమ సెగకు రాష్ట్ర ప్రభుత్వం మెత్తబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు అధికార వికేంద్రీకరణ అంటూ బింకంగా పలికిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు కాస్త పట్టు సడలించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేసినా అమరావతి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ జగన్ ప్రభుత్వంలోని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం ప్రభుత్వం మెట్టు దిగుతోందనడానికి సంకేతంగా కనిపిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించారని.. వారు ఇప్పుడు అదనంగా ఏమైనా కోరుకుంటే ప్రభుత్వం పరిశీలిస్తుందని బొత్స అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పత్రికలపై మండిపడ్డారు. అమరావతి నుంచి పాలన సాగుతోందని చెబుతున్న ఈనాడు చంద్రబాబు ఇది తాత్కాలిక సచివాలయం అన్న సంగతి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు వారి ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వాన్ని ‘ఆంబోతు ప్రభుత్వం’గా నారా లోకేశ్ అభివర్ణించారని, ‘భాష’ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబు, రామోజీరావుల ఆలోచనలకు అనుగుణంగా తాము నడవమని, తమ ప్రభుత్వానికి ఒక బాధ్యత, ఆలోచన ఉన్నాయని, దాని ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప, ఎవరి బ్లాక్ మెయిలింగ్ కో, పిచ్చి పిచ్చి రాతలకో భయపడే ప్రసక్తే లేదని, దేనికీ లొంగమని స్పష్టం చేశారు. 'ఏపీలోని మూడు ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి, ఎందుకు తొందర?' అంటూ విలేకరులుకు సమాధానమిచ్చారు.