Begin typing your search above and press return to search.

చైనా నుండి ఎలాంటి దాడినైనా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నాం!!

By:  Tupaki Desk   |   27 Jun 2020 6:00 AM GMT
చైనా నుండి ఎలాంటి దాడినైనా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నాం!!
X
సరిహద్దుల్లో చైనా నుంచి ఎలాంటి దాడినైనా సమర్ధంగా ఎదుర్కోడానికి సైన్యం సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరిగిన సమావేశంలో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే వివరించారు. తూర్పు లడఖ్‌ లోని కార్యాచరణ పరిస్థితుల గురించి అగ్ర రాజకీయ నాయకత్వానికి వివరించిన ఆర్మీ చీఫ్.. ఈ ప్రాంతంలో మోహరించిన సైన్యం మొత్తం పోరాట సామర్థ్యం చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులను అడ్డుకుంటుందని తెలిపారు. సరిహద్దుల్లో రెండు రోజుల పాటు పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించిన నరవాణే... అనంతరం గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివరించారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తోనూ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుత అంచనా ప్రకారం.. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి వ్యూహాత్మక ప్రాంతం దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్పాంగ్ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) భారీగా సైన్యాలు, ఆయుధాలను మోహరించినా పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత్ కూడా వేలాది మంది అదనపు బలగాలను, యుద్ధ ట్యాంకులు, వాహనాలును తరలించింది.

సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు సరిహద్దుల్లో ఎగురుతున్నాయి.. ఈ ప్రాంతంలో తాము కూడా పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నామని తెలిపాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ముఖ్యమంగా పాంగాంగ్ సో, గాల్వన్ లోయ వద్ద ఇరు సైన్యాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటుచేసుకోలేదు. జూన్ 15 ఘర్షణలు చోటుచేసుకున్న గాల్వన్ లోయ వద్ద పెట్రోలింగ్ పాయింట్-14 తమదేనంటూ చైనా పదే పదే వాదిస్తోంది. ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం వైదొలగాలని డిమాండ్ చేస్తోంది. ఫింగర్ 4 నుంచి 8 వరకు ప్రాంతాలను కూడా చైనా సైన్యం ఆక్రమించింది.

కానీ, భారత్ మాత్రం ఇది తమ భూభాగమని, ఏప్రిల్ ముందు నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత తగ్గడానికి సమయం పడుతుంది.. ఇది అక్టోబరు వరకు కొనసాగే అవకాశం ఉంది.. కొన్ని వాహానాల రాకపోకలు సాగుతున్నాయి..మేము వేచిచూసే ధోరణితో ఉన్నాం’ అని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా తన నిరంతర వ్యూహంలో భాగంగా ఎల్ఏసీని పశ్చిమ వైపునకు నెట్టవచ్చు.. కానీ, భారత్ కూడా మెరుగైన స్థితిలో ఉండటంతో అంత సులభం కాదు.. పెద్ద సంఖ్యలో సైన్యాలు, వనరులు, కార్యాచరణ సంసిద్ధత చైనాకు అవసరం అని తెలిపాయి.