Begin typing your search above and press return to search.

మోడీ నినాదాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   21 July 2019 4:52 PM GMT
మోడీ నినాదాన్ని కించపరిచిన బీజేపీ ఎంపీ!
X
సంచలన రీతిలో భోపాల్ నుంచి ఎంపీగా విజయం సాధించిన సాధ్వీ ప్రజ్ఞ తన వివాదాస్పద రీతిని కొనసాగిస్తున్నట్టుగా ఉన్నారు. ఎంపీగా ఎన్నిక కాకముందు ఈమె కొన్ని వివాదాల్లో నిలిచారు. ఈమెకు బీజేపీ ఎంపీ టికెట్ ను కేటాయించడం పైనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మోడీ గాలిలో ఈమె ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత -మధ్య ప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ను ఆమె ఓడించి గెలిచారు.

ఆ సంగతలా ఉంటే.. తన నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడుతూ సాధ్వీ ప్రజ్ఞ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతున్న స్వచ్ఛ భారత్ సిద్ధాంతాలను కించపరిచేవిలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఈ ఎంపీ ఏమన్నారంటే.. 'నేనేం టాయ్ లెట్లు, బాత్రూమ్ లు కడిగేందుకు ఎంపీగా గెలవలేదు..' అంటూ సాధ్వీ వ్యాఖ్యానించారు!

ఒకవైపు మోడీనేమో స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఆ టాపిక్ గత టర్మ్ ప్రారంభం నుంచి కొనసాగుతోంది. స్వచ్చభారత్ లో మరుగుదొడ్ల ప్రస్తావన - వాటి క్లీనింగ్ ప్రముఖమైన అంశంగా నిలుస్తోంది. ఆఖరి సినిమా హీరోలు కూడా మరుగుదొడ్ల శుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్న పరిస్థితి.

ఇక బీజేపీ నేతలు ఇప్పటికీ చీపుర్లు పట్టుకుని పోజులు ఇస్తూనే ఉన్నారు. ఈ ట్రెండ్ కొనసాగుతున్నా తను అలాంటి తరహా ఎంపీని కాదని సాధ్వీ తేల్చేయడం గమనార్హం. ఏ పనులు అయితే అందరూ చేయాలని మోడీ పిలుపునిస్తున్నారో, తను ఆ టైపు కాదని సాధ్వీ కుండబద్దలు కొట్టడం గమనార్హం!