Begin typing your search above and press return to search.

తగలబడిన ఇల్లు మంత్రి విశ్వరూప్ ది కాదా? మరెవరిది?

By:  Tupaki Desk   |   27 May 2022 5:30 AM GMT
తగలబడిన ఇల్లు మంత్రి విశ్వరూప్ ది కాదా? మరెవరిది?
X
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును పెట్టడంపై అమలాపురం పట్టణంలో చెలరేగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. మే 24న ఆందోళనకారులు అమలాపురంలో ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను దహనం చేసిన సంగతి తెలిసిందే.

అలాగే కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 70 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 19 మందిని ఇప్పటికే అరెస్టు చేయగా మరో 46 మందిని తమ అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

కాగా మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసంలో ఆందోళనకారులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్, ముమ్మడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ లకు చెందిన ఇళ్లను పెట్రోలు పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రి విశ్వరూప్ వి రెండు ఇళ్లు ఉన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి గాలిలోకి కాల్పులు జరిపితే కానీ నిరసనకారులు శాంతించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఓ కొత్త విషయం బయటపడింది.

అమలాపురం బ్యాంక్ కాలనీలో మంత్రి పినిపె విశ్వరూప్ గా చెబుతున్న ఇల్లు వాస్తవానికి ఆయన కాదని అంటున్నారు. అగ్నికి ఆహుతయిన ఆ ఇంటిలో మంత్రి అద్దెకు ఉంటున్నారని చెబుతున్నారు. ఆ ఇల్లు ఒక ప్రొఫెసర్ కు చెందిన ఇల్లు అని పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఆ ఇంటి యజమాని వీరభద్రరావు కూడా రంగంలోకి వచ్చాడు. తానొక ప్రొఫెసర్ నని ప్రస్తుతం తాను అమలాపురంలో ఉండటం లేదని.. తాను ఉద్యోగ విధుల నిమిత్తం కాకినాడలో ఉంటున్నానని తెలిపారు. మంత్రి పినిపె విశ్వరూప్ కు మూడేళ్ల క్రితం ఆ ఇంటిని అద్దెకిచ్చానని వివరించారు.

మంత్రి విశ్వరూప్ ప్రస్తుతం అమలాపురంలోనే సొంతంగా ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారని.. ఆ ఇల్లు పూర్తి కావచ్చిందని వీరభద్రరావు తనను కలసిన మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఇంతలో మంత్రి అద్దెకు ఉంటున్న తన ఇంటితోపాటు మంత్రి సొంతంగా నిర్మించుకుంటున్న ఇంటిని ఆందోళనకారులు కాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ త్వరలోనే కొత్త ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని వివరించారు. అలాగే తాను కూడా కాకినాడ నుంచి అమలాపురంలోని తన ఇంటికి రావాలనుకున్నానని పేర్కొన్నారు. ఇంతలో ఈ ఘటన జరిగిందని వివరించారు.

తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో 6500 చదరపు అడుగుల్లో ఈ ఇంటిని నిర్మించుకున్నానని.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నానని వీరభ్రదరావు వెల్లడించారు. ఇప్పుడు ఇల్లు కాలిపోయిన సంగతి తెలిసి కాకినాడ వచ్చానని.. రూపురేఖలు లేకుండా తన ఇల్లు ధ్వంసమైందని వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తానొక ప్రొఫెసర్ నని ఏ పార్టీతోనూ తనకు సంబంధాలు లేవని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా మంత్రి విశ్వరూప్ తో మాట్లాడలేదని తెలిపారు. ఇంటికి ఇన్సూరెన్సు ఉందో, లేదో తెలియదని, మంత్రి ఏమైనా పరిహారం అందిస్తారో, లేదో కూడా తెలియదని వివరించారు.