Begin typing your search above and press return to search.

సుబ్బారాయుడు హత్య: భూమా వర్సెస్ శిల్పా

By:  Tupaki Desk   |   30 Oct 2020 6:09 PM GMT
సుబ్బారాయుడు హత్య: భూమా వర్సెస్ శిల్పా
X
నంద్యాలలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం సెగలు పుట్టిస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా కుటుంబంపై వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, దళిత న్యాయవాది సుబ్బారాయుడును టీడీపీ నాయకుడే హత్య చేశాడని ఆయన ఆరోపించడం కలకలం రేపింది.

సుబ్బారాయుడును హత్యచేసిన వ్యక్తి భూమా కుటుంబంతో ఫొటోలు మాత్రమే దిగలేదని..వారితో అక్రమ వ్యాపారాలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఆరోపించారు. హత్య రాజకీయాలతో భయపెడితే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని.. నంద్యాలలో భయం సృష్టించాలని చూస్తే ఎవరూ ఊరికే ఉండరని తెలిపారు.

భూమా కుటుంబం వల్లే ఆళ్లగడ్డ అభివృద్ధికి నోచుకోలేదని.. 2014 నుంచి భూమా కుటుంబం తమ నాయకులపై అనేక దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపించారు. హత్య వెనుకాల ఉన్న కుట్రదారులు ఎంతటి వారైనా వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని శిల్పారవి డిమాండ్ చేశారు.

*భూమా కుటుంబానికి సంబంధం లేదు: భూమా అఖిల ప్రియ
సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి.. దమ్ముంటే వారం రోజుల లోపల నిరూపించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటానని చెప్పారు. అలాకాని పక్షంలో తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిలప్రియ హెచ్చరించారు.

కాగా.. నంద్యాలలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వాకింగ్ కు వెళ్లిన సమయంలో కర్రలతో కొట్టి ఆయనను చంపినట్లు పోలీసులు తెలిపారు. దీనివెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ హత్యపై వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.