Begin typing your search above and press return to search.

పరిపాలన రాజధాని విశాఖకు కొత్తందాలు: రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం

By:  Tupaki Desk   |   23 Jun 2020 8:30 AM GMT
పరిపాలన రాజధాని విశాఖకు కొత్తందాలు: రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం
X
మూడు రాజధానుల్లో భాగంగా విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాజధాని తరలింపు పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. దీంతో విశాఖపట్టణానికి కొత్త అందాలు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే విశాఖలోని కైలాసగిరిపై ప్లానిటోరియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.37 కోట్లతో 7 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే ప్లానిటోరియం డిజైన్‌ ఖరారు చేసింది. టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కైలాసగిరి అభివృద్ధికి పూర్తిస్థాయి ప్రణాళికల్ని వీఎంఆర్‌డీఏ సిద్ధం చేసింది.

సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే సుందరంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్లానిటోరియం నిర్మాణానికి కైలాసగిరి సిద్ధమవుతోంది. హైబ్రిడ్‌ ప్రొజెక్షన్లు, 3డీ డిజిటల్‌ ప్రొజెక్టర్‌తో 200 మంది కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం నిర్మించనున్నారు. ప్రదర్శన ప్రారంభమైన వెంటనే నక్షత్రాల నడుమ విహరించే అనుభూతిని 3డీ టెక్నాలజీ కలిగించనుంది. ఇది పర్యాటకులకు మధురానుభూతిని పంచేలా ఉంది.

ప్లానిటోరియం మాత్రమే కాకుండా గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలం, ఉపగ్రహాలు.. ఇలా సౌర కుటుంబంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చుట్టూ వివరాలు తెలుసుకునేలా చిత్రాలు, వివరాలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లానిటోరియం కర్నాటక రాష్ట్రం మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో మొదటి త్రీడీ ప్లానిటోరియంమైన మంగుళూరు కేంద్రాన్ని కొద్ది నెలల క్రితం వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు బృందం పరిశీలించింది.

సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ తీరుని పరిశీలించి మంగుళూరుకి మించి అంతర్జాతీయ హంగులతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. త్రీడీ షో తో పాటు.. ప్లానిటోరియంలో కాఫీ షాప్, సావనీర్‌ షాపింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పనకు కోల్‌కతా ఎన్‌సీఎస్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ అరిజిత్‌ దుత్తాచౌదరి నేతృత్వంలో నలుగురు నిపుణుల బృందాన్ని నియమించారు.

ఈ కమిటీ డీపీఆర్, డిజైన్ల రూపకల్పనకు కైలాసగిరిపై ప్లానిటోరియం నిర్మాణానికి అనువైన స్థల గుర్తింపు, కావాల్సిన పరికరాలు, ఐకానిక్‌ బిల్డింగ్, ఇతర సాంకేతిక అంశాల విషయాలపై సూచనలు చేసింది. కమిటీ సూచించిన అంశాల ప్రకారం ప్లానిటోరియం డిజైన్ల కోసం వీఎంఆర్‌డీఏ పోటీ నిర్వహించింది. అర్హత గల ఆర్కిటెక్ట్‌ సంస్థల నుంచి డిజైన్లను ఆహ్వానించగా. 66 ఆర్కిటెక్ట్‌ సంస్థలు పోటీ పడ్డాయి. వీటిలో స్టూడియో ఎమర్జెన్స్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ని ఎంపిక చేసి.. దాని తరహాలో ప్లానిటోరియం నిర్మించాలని నిర్ణయించారు.

ప్రాథమికంగా డిజైన్‌ను ఎంపిక చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై వీఎంఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. డిజైన్‌లో మార్పులు చేర్పులు, ఇంజినీరింగ్‌ స్ట్రక్చరల్‌ వ్యవహారాలపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లతో త్వరలోనే కమిటీ వేయనుంది. వీరంతా.. ఈ డిజైన్‌లో మార్పులు చేసి ప్లానిటోరియంకు తుది రూపు తీసుకురానున్నారు. చివరకు ఒకటి ఖరారు చేసి త్వరలోనే పనులు మొదలు పెట్టే యోచన చేస్తున్నారు.