Begin typing your search above and press return to search.

విశాఖ అంటే జగన్ కి కక్ష... ?

By:  Tupaki Desk   |   8 Feb 2022 1:30 AM GMT
విశాఖ అంటే జగన్ కి కక్ష... ?
X
పరిపాలకుడికి అందరూ సమానమే. అన్ని ప్రాంతాలూ సమానమే. అలాంటి రాజనీతిని పాటిస్తేనే రాజు ధర్మంగా ఉన్నట్లు. కానీ విభజన ఏపీలో చూసుకుంటే ఇప్పటిదాకా పాలించిన ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రెండు రకాలైన విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు అమరావతి ప్రేమికుడు, పక్షపాతి అని వైసీపీ తరచూ విమర్శలు చేస్తుంది. ఏపీలోని మిగిలిన ప్రాంతాలు ఏమైపోయినా బాబుకు అమరావతి మాత్రమే కావాలి అని వైసీపీ నేతలు వీలు దొరికినప్పుడల్లా ఎద్దేవా చేస్తూంటారు.

ఇక జగన్ కి కూడా అలాంటి ముద్ర ఉంది. అయితే అది నెగిటివ్ టచ్ తో కూడుకున్నది. జగన్ కి విశాఖ అంటే అసలు ఏ కోశానా ఇష్టం లేదని, మెగా సిటీ మీద క‌క్ష కట్టారని తరచూ టీడీపీ తమ్ముళ్లు జగన్ని ఆడిపోసుకుంటారు. ఏడేళ్ళుగా ఇలాంటి ఆరోపణలనే టీడీపీ జగన్ మీద చేస్తూ వస్తోంది. దీని ఫలితమా అన్నట్లుగా ఏపీలో అన్ని చోట్లా గెలిచినా వైసీపీ విశాఖ సిటీలో 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీకి బొటాబొటీ మెజారిటీతోనే గ్రేటర్ విశాఖ దక్కింది. ఇక 2019లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణకు కేవలం మూడు వేల మెజారిటీ మాత్రమే వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి.

ఒక విధంగా విశాఖలో వైసీపీకి రాజకీయంగా గట్టి పట్టు లేదనే అంటారు. అలాంటి విశాఖను రాజధానిగా చేస్తానని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నా అది సాకారం కాలేదు, మరో వైపు ప్రశాంత విశాఖను అశాంతిమయం చేయడానికే జగన్ రాజధాని అన్నారని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లాండ్ మాఫియా పెరగడానికే రాజధాని ప్రకటన తప్ప నిజానికి విశాఖ మీద వైసీపీ పెద్దలకు ప్రేమ లేదని కూడా అంటారు.

ఇపుడు చూస్తే జగన్ విశాఖ మీద కక్ష పెంచుకున్నారని, అందుకే ఆయన విశాఖ అభివృద్ధిని కాలరాస్తున్నారని కొత్త పాయింట్ ని టీడీపీ నేతలు ఎత్తుకున్నారు. అదేంటి అంటే కొత్త జిల్లాల ఏర్పాటులో విశాఖలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తిని తీసుకెళ్ళి అనకాపల్లిలో కలిపేశారని టీడీపీ నేతలు ఒక్క లెక్కన మండిపడుతున్నారు. నిజానికి విశాఖ అభివృద్ధిలో పెందుర్తి ప్రముఖ పాత్ర వహిస్తోంది. విశాఖ సిటీ బాగా పెరిగింది అంటే దానికి పెందుర్తి ఒక ప్రధాన కారణం.

అలాంటి పెందుర్తిని అనకాపల్లిలో విలీనం చేయడం ద్వారా జగన్ విశాఖ మీద తన కక్షను తీర్చుకున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సీరియస్ కామెంట్స్ చేశారు. విశాఖలో పెందుర్తి కలసి ఉంటే అభివృద్ధితో పాటు భారీ ఎత్తున ఆదాయం వచ్చేదని, దాన్ని తీసుకెళ్లి అనకాపల్లిలో కలిపి విశాఖకు జగన్ తీరని అన్యాయం చేశారని బండారు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

విశాఖ మీద జగన్ కక్షకు కారణం 2014 ఎన్నికల్లో ఆయన తల్లి వైఎస్ విజయమ్మను విశాఖ వాసులు ఓడించడమే అని కూడా బండారు చెబుతున్నారు. ఆ కక్ష ఇంకా ఆయనకు తీరలేదని అంటున్నారు. దీని మీద వైసీపీ నేతలు రిటార్ట్ ఇస్తున్నారు. కొత్త జిల్లాల పేరిట అన్ని చోట్ల ఉన్న వాటిని ముక్కలు చేశారని, ఒక పద్ధతి ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశార‌ని, శాస్త్రీయ విధానంలో మధింపు చేసి జిల్లాలు ఏర్పాటు చేస్తే టీడీపీ రాజకీయ విమర్శలు చేయడమేంటి అని ఫైర్ అవుతున్నారు.

కొత్త జిల్లాలను వైసీపీ ఏర్పాటు చేయడాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోంది అని వారు అంటున్నారు. మొత్తానికి బండారు కొత్త జిల్లాల విషయంలో కూడా జగన్ విశాఖకు అన్యాయం చేశారని, ఆయన కక్ష కట్టేశారు అన్న మాటలు చూస్తే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కీలకమైన టైమ్ లో విశాఖ మీద జగన్ కి ప్రేమ ఉందని చెప్పుకోవడానికి ఆయన ఏం చేస్తారో చూడాలి మరి. పెందుర్తిని తీసుకువచ్చి విశాఖలో కలపాలని జిల్లా ప్రజలు కూడా కోరుతున్న వేళ అందరి చూపూ ప్రభుత్వ తీసుకోబోయే నిర్ణయం మీదనే ఉంది.