Begin typing your search above and press return to search.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ కు వచ్చేవి ఏవంటే ?

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:12 PM IST
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ కు వచ్చేవి ఏవంటే ?
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత శాసన సభ సమావేశాల్లో చివరి రోజు ఏపీ రాజధాని విషయంలో మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అంటూ చేసిన ప్రకటనే యాజ్ ఇట్ ఈజ్‌గా సోమవారం అసెంబ్లీలోకి బిల్లు రూపంలో వచ్చింది. సీఎం జగన్ తాను ఏది అనుకున్నారో రాజధాని విషయంలో అదే చేసి చూపించారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన కేబినెట్.. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖను.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిని లిజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశ పెట్టారు.

ఇక మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖపట్నం నగరానికే ఎక్కువ ప్రయోజనం చేకూరనుందని అని తాజా నిర్ణయంతో అర్ధం అవుతుంది. అయితే గతంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపులిచ్చిన నివేదిక నుంచి కొన్ని అంశాలను మాత్రం మినహాయించి సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాల హెడ్ క్వార్టర్స్ ఇలా అన్నీ విశాఖ నగరంలోనే ఏర్పాటు కానున్నాయి. శాసనసభా కార్యకలాపాలు నిర్వహించే సచివాలయం మాత్రం అమరావతి లో ఏర్పాటు కానుంది. కేవలం సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగితా అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరగనున్నాయి. సచివాలయం తో పాటుగా ఇతర కీలక కార్యాలయాలు అన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు కాబోతుండటం తో విశాఖ రూపురేఖలు అతి త్వరలోనే మారుతాయని చెప్పవచ్చు. ఇకపోతే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావటంతో విశాఖ వాసులు సంబరాల్లో మునిగి పోయారు.