Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి

By:  Tupaki Desk   |   6 May 2017 6:47 AM GMT
లోకేష్‌ కు నిర‌స‌న‌లు మొద‌ల‌య్యాయి
X
సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - రాష్ట్ర పంచాయతీరాజ్‌ - ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ కు నిర‌స‌న‌ల ప‌ర్వం మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. విశాఖ జిల్లాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అనకాపల్లిలో సమావేశం ముగించుకొని కశింకోట వెళ్తూ బయ్యవరం- త్యాగడ మధ్య ఉపాధి హామీ పథకం కూలీలతో మంత్రి లోకేష్‌ సమావేశమయ్యారు. అప్పటికే పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు - గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా, తాగునీటి సమస్యపై మహిళలు నిలదీశారు. కశింకోట మండలంలోని కొత్తపల్లిలోని పరిశ్రమల వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో నీరు కలుషితమైందని, తమకు మంచినీరు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయా గ్రామాల మహిళలు ఖాళీ బాటిళ్లతో లోకేష్‌ కు కనిపించేలా చూపించి, సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన నారా లోకేష్‌ కలుషితం అవుతున్న గ్రామాలకు ట్యాంక్‌ నీరు అందిస్తామని చెప్పారు.

ఉద్దండపురంలో జరిగిన ఉపాధి హామీ విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ తనకు పల్లెలు అంటే ఇష్టమని అందుకే పంచాయతీరాజ్‌ శాఖను కేటాయించారని తెలిపారు. పల్లెలకు సేవ చేస్తే పరమాత్మకు సేవచేసినట్లేనని అటువంటి పల్లెలను అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేస్తామన్నారు, అలాగే రానున్న రెండు సంవత్సరాల్లో అన్ని పంచాయితీలకు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేస్తామని గ్రామాల్లో ఉన్న ప్రజలందరికి ఎల్‌ ఇడి బల్బులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని లోకేష్ చెప్పారు. పంచాయితీల్లో మరియు రోడ్లు మీద చెత్తా చెదారాల నుంచి వర్మి కంపోస్టు త‌యారు చేయించి పంచాయితీ నుంచి ఆ చెత్తను కోనుగోలు చేస్తామని అన్నారు. పంచాయితీలో అభివృద్ది సర్పంచ్‌ లు - ఎంపిటిసీ చేతుల్లో ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయితీలు అభివృద్ది కోసం భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అవన్ని పంచాయితీల్లో సర్పంచ్‌ లు ఎంపీటీసీలు అభివృద్ది చేసే విధంగా కృషి చేయాలన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో వృద్దులకు రూ.200 పెన్షన్లు ఇచ్చే వారిని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత వెయ్యి రూపాయిలకు పెంచామ‌ని లోకేష్ తెలిపారు. అలాగే రైతులకు 25 వేల రూపాయిలు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. తాజాగా యూపీలో జరిగిన ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ ప్రకటించి బీజేపీ అఖండ విజయం సాధించిందని లోకేష్‌ గుర్తు చేశారు. డ్వాక్రా మహిళలకు రెండు దశలలో ఆరు వేల రూపాయిలు చొప్పున టీడీపీ ప్రభుత్వం బ్యాంకుల్లో జమచేసిందని, మూడో దశలో నాలుగు వేల రూపాయిలు జమచేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/