Begin typing your search above and press return to search.

విక్ర‌మ్ గౌడ్‌ ను ఆద‌ర్శంగా తీసుకుటుంటున్నారే!

By:  Tupaki Desk   |   2 Sep 2017 7:45 AM GMT
విక్ర‌మ్ గౌడ్‌ ను ఆద‌ర్శంగా తీసుకుటుంటున్నారే!
X
ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని... వాటి నుంచి త‌న‌ను తాను బ‌య‌ట‌ప‌డేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్ర‌మ్ గౌడ్ అనుస‌రించిన వ్యూహాన్ని ఇప్పుడు చాలా మంది ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. అందుకు నిద‌ర్శ‌న‌మే... వారం క్రియం ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ విజ‌య‌వాడ‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌. విక్ర‌మ్ గౌడ్ ఘ‌ట‌న‌ను ఓ సారి గుర్తు చేసుకుంటే... ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న విక్ర‌మ్ గౌడ్‌... రుణ దాత‌ల నుంచి ఒత్తిడి పెరిగిన నేప‌థ్యంలో వాటి నుంచి త‌ప్పించుకునేందుకు ప‌క్కా ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ లో *త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గాలి. తాను మాత్రం బ‌త‌కాలి* అన్న‌దే పాయింట్‌.

అదేదో మ‌హేశ్ బాబు సినిమా *అత‌డు*లో షాయాజీ షిండే కూడా తాను సీఎం కుర్చీ ఎక్కేందుకు ఇదే త‌ర‌హా ప్లాన్ వేసుకుంటాడు. స‌ద‌రు చిత్రంలోని ఓ సీనునే విక్ర‌మ్ గౌడ్ త‌న విష‌యంలోనూ ప్లాన్ చేసుకున్నాడ‌న్న వాద‌న వినిపించింది. తాను ఒప్పందం చేసుకున్న వ్య‌క్తులు ఒకానొక రోజు విక్ర‌మ్ గౌడ్‌ పై అత‌డి ఇంటిలోనే కాల్పులు జ‌రిపి పారిపోయారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన పోలీసులు విక్ర‌మ్ గౌడ్ అస‌లు సిస‌లు ప్లాన్‌ ను బ‌య‌ట‌పెట్టారు. ఈ ఘ‌ట‌న నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నంగా మారింద‌నే చెప్పాలి. తెలంగాణ‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు ఏపీలోని వారికి కూడా ఆద‌ర్శంగా నిలిచిన వైనం బ‌య‌ట‌ప‌డింది.

విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల చోటుచేసుకున్న ఈ తాజా ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... న‌గ‌రానికి చెందిన‌ మాజీ జర్నలిస్టు పేర్ల శ్యాంకుమార్ తన తోడల్లుడితో ఉన్న ఆర్థిక లవాదేవీల నేపథ్యంలో తనపైనే హత్యాయత్నం చేయించుకున్నాడు. నగరంలోని సీతారాంపురంలో ఉంటూ సాయంకాలం దినపత్రిక నడుతుపుతున్న శ్యాంకుమార్... తన తోడల్లుడు దేవశెట్టి సుబ్బారావుతో కలిసి విద్యాధరపురంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. సుబ్బారావు తన అవసరాల కోసం శ్యాంకు సంబంధించిన ఆస్తిని బ్యాంకులో హామీగా పెట్టి రూ. 20 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆస్తిని జప్తు చేస్తామంటూ బ్యాంకు నుంచి శ్యాంకు నోటీసులు వచ్చాయి. ఈ విషయంలో పెద్ద మనుషుల మధ్య వారిద్దరూ పంచాయితీ చేసుకున్నారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

విక్రమ్ గౌడ్ తరహాలో తనపై హత్యాయత్నం చేయించుకుని ఈ కేసులో తోడల్లుడిని ఇరికిస్తే భారీగా డబ్బు వసూలు చేసుకోవచ్చని శ్యాం ప్లాన్ చేశాడు. తన స్నేహితులైన భవానీపూరానికి చెందిన నాగేంద్ర - మధురానగర్ కు చెందిన కృష్ణప్రసాద్ లతో కలిసి ప్లాన్ చేశాడు. ఎక్కడ కత్తిపోట్లు ఉండాలో కూడా ముందుగానే నిర్ణయించారు. ఇందుకు రూ. 2 లక్షలు బేరం కూడా కుదిరింది. వారం కిందట శ్యాంను అత‌డి ఇంటి వద్ద నాగేంద్ర - కృష్ణప్రసాద్ లు కత్తితో పొడిచి పారిపోయారు. తరువాత శ్యాం ఆసుపత్రిలో చేరాడు. ఆ త‌ర్వాత అమెరికాలోని ఉన్న తోడల్లుడి కొడుకుతో రూ.40 లక్షలు ఇవ్వాలంటూ శ్యాం మనుషులు బేరాలు మొదలుపెట్టారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో శ్యాంతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.