Begin typing your search above and press return to search.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై అనుమానాలు?

By:  Tupaki Desk   |   10 July 2020 8:30 AM GMT
వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై అనుమానాలు?
X
అందరూ భావించినట్టే ఉత్తరప్రదేశ్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఈ ఉదయం పోలీసులు లేపేశారు. అతడి అనుచరులందరినీ ఇప్పటికే ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు సినిమాటిక్ స్టైల్లో ఈ ఉదయం వికాస్ ను ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులు చెబుతున్న కారణాలు ఏవైనా కానీ ఈ ఎన్ కౌంటర్ పై అందరిలోనూ అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. కరుడుగట్టిన నేరస్థుడిని చంపడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం చెలరేగింది. యూపీ రాజకీయాలను కుదిపేసేలా కనిపిస్తోంది. అతడిని తీసుకొస్తున్నకారు ప్రమాదానికి గురికావడం వెనుక అనుమానాలున్నాయని.. వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసులను చంపి.. ఒక పోలీస్ తలను, మొండాన్ని వేరు చేసిన ఈ నరరూప రాక్షసుడిని మధ్యప్రదేశ్ లో పట్టుకొని కాన్పూర్ తీసుకొస్తుండగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కారు పల్టీ కొట్టగా తప్పించుకొని పారిపోతుండగా ఈ పనిచేశామని పోలీసులు చెబుతున్నారు.

అయితే వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను చంపడం వెనుక యూపీ పోలీసులే ఉప్పందించారని ఇద్దరినీ సస్పెండ్ చేశారు. అతడికి రాజకీయ అండదండలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో నిజాలు దాచేందుకే అతడిని ఎన్ కౌంటర్ చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కృత్రిమంగా కారు ప్రమాదాన్ని సృష్టించారని ఆరోపిస్తున్నారు.

తాజాగా మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ విషయంపై తొలిసారి స్పందించారు. యూపీలోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండటానికే వికాస్ దూబేను కృత్రిమంగా ఫేక్ ఎన్ కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. యోగీ సర్కార్ పల్టీ కొట్టకుండా ఉండడానికే వికాస్ కారును పల్టీ కొట్టించారని విమర్శించారు.

వికాస్ దూబేను విచారించి ఉంటే యోగి ప్రభుత్వానికి నూకలు చెల్లేవని.. నేరస్థులు, గ్యాంగ్ స్టర్లతో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వానికి చీకటి ఒప్పందాలు ఉన్నాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అవన్నీ వెలుగులోకి రావద్దనే వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేశాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.